దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ పోర్టల్ సిద్ధం చేసిన కేంద్రం
న్యూదిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు సర్వం సిద్ధం చేసేసింది. ఇందుకోసం హోంమంత్రిత్వశాఖ ఇప్పటికే కసరత్తు పూర్తిచేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మూడు పొరుగు దేశాలు పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్లో స్థిరపడిన ముస్లింయేతర మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వడానికి సీఏఏ వచ్చే నెల నుంచి అమలులోకి తెచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్ పోర్టల్ సిద్ధంగా ఉందని… కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని వెల్లడిరచాయి. గుర్తింపు పత్రాలు లేకుండా ఈ పొరుగు దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు సీఏఏతో ప్రయోజనం చేకూరుతుందని ఆ వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలిక వీసాల కోసం మంత్రిత్వ శాఖ స్వీకరించిన దరఖాస్తుల్లో అత్యధిక సంఖ్యలో పాకిస్థాన్ నుంచే వచ్చాయి. దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేసే అధికారాలు ఇప్పటికే జిల్లా అధికారులకు ఇవ్వబడ్డాయి. ఇది సీఏఏ అమలును సూచిస్తోంది. పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వం మంజూరు చేయడానికి గత రెండేళ్లుగా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 30 మంది జిల్లా మేజిస్ట్రేట్లు,హోం సెక్రటరీలకు అధికారాలు ఇవ్వబడ్డాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక ప్రకారం ఏప్రిల్ 1, 2021 నుండి డిసెంబర్ 31, 2021 వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి మొత్తం 1,414 మంది ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం రిజిస్ట్రేషన్ లేదా పౌరసత్వం ద్వారా భారత పౌరసత్వం ఇవ్వబడిరది. దేశవ్యాప్తంగా భారీ నిరసనల మధ్య 2019లో మూడు పొరుగు దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లిమేతరులకు ఆశ్రయం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్న సీఏఏ బిల్లును పార్లమెంటు ఆమోదించింది.
2019లోనే మోదీ సర్కారు సీఏఏ చట్టం చేసినా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాని అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ సీఏఏ అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉందని ఇటీవలి వరుస పరిణామాలు చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా దేశమంతటా దాని అమలు తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇటీవల స్పష్టం చేశారు.
ఏమిటీ చట్టం?
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్క్రెస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి మోదీ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. మతపరమైన ఒత్తిళ్లను తప్పించుకుని భారత్ వచ్చే వారికి ఇది ఆశ్రయం కల్పిస్తుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతుండగా… ముస్లింలను మరింత అణచివేసే బీజేపీ అజెండాలో ఈ బిల్లు ఒక భాగమని విపక్షాలు తీవ్రంగా నిరసించాయి. ఈ చట్టం ముస్లింలపై వివక్ష చూపుతుందని, రాజ్యాంగంలోని లౌకిక సిద్ధాంతాలను ఉల్లంఘిస్తోందని విపక్ష నేతలు విమర్శించారు.