విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: అర్బన్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీల జాతీయ సమాఖ్య (నాప్కాబ్-నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్) డైరెక్టర్గా ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ఎన్నికయ్యారు. న్యూదిల్లీలోని నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆడిటోరియంలో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో రాఘవేంద్రరావు 211 ఓట్లు సాధించారు. నాప్కాబ్కి మొత్తం వివిధ కేటగిరీల నుంచి 19 మంది డైరెక్టర్లు ఎన్నిక కావాల్సి ఉండగా, ఇప్పటికే 12 మంది ఏకగ్రీవమయ్యారు. అర్బన్ బ్యాంకులకు కేటాయించిన ఏడు స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నిక జరిగింది. జాతీయ సమాఖ్య మార్గదర్శకులు చైర్మన్ ఎమిరిటస్, కర్నాటక రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్, నాప్కాబ్ ప్రస్తుత అధ్యక్షుడు జ్యోతేంద్రభాయి మెహతా నాయకత్వంలో దేశంలో వివిధ రాష్ట్రాల ఫెడరేషన్ల మద్దతుతో ‘సహకార్ సే సమృద్ధి 24’ ప్యానల్ నుంచి ఏడుగురు అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి చలసాని రాఘవేంద్రరావు అత్యధికంగా 211 ఓట్లతో గెలుపొందారు. చలసానితోపాటు ఇదే ప్యానల్ నుంచి పోటీ చేసిన కర్నాటక రాష్ట్ర మాజీమంత్రి, అజాద్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, ఏఎం హిందాస్ గిరి, ది కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, సీఏ మిలింద్ కాలే (మహారాష్ట్ర), బార్దోలీ నాగ్రిక్ సహకారి బ్యాంక్ చైర్మన్ గౌతమ్ బాయ్ వ్యాస్ (గుజరాత్), అకోలా జనతా కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జియాన్ చంద్ గార్గ్ (మహారాష్ట్ర), ప్రస్తుత నాప్కాబ్ డైరెక్టర్ కె.కాలప్ప (కర్నాటక), వర్ఛ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కంజీభాయ్ బలాలా (గుజరాత్) నూతన డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు.
పోలింగ్లో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, హరియాణా, దిల్లీ తదితర రాష్ట్రాల నుంచి 230 ఓట్లు పోలవ్వగా, 8 ఓట్లు చెల్లలేదు. గెలుపొందిన ఏడుగురు డైరెక్టర్లలో జియాన్ చంద్ గార్గ్ 212 ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలవగా, రాఘవేంద్రరావు 211 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. దేశంలోని సుమారు 1500కు పైగా అర్బన్ సహకార బ్యాంకుల్లో వివిధ విభాగాల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రతినిధికి డైరెక్టర్ స్థానం ఇవ్వాలన్న నాప్కాబ్ పెద్దల సమష్టి ఆలోచనలతో చలసాని ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్లు కొనసాగనున్నారు.
కృష్ణాజిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురం గ్రామానికి చెందిన చలసాని రాఘవేంద్రరావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులుగా, ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మాజీ శాసనసభ్యులు, ప్రముఖ కమ్యూనిస్టు నేత మానం ఆంజనేయులు 1983లో ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బ్యాంకు పురోభివృద్ధికి చలసాని కృషి చేస్తున్నారు.1993లో తొలిసారి బ్యాంకు డైరెక్టర్గా ఎన్నికైన ఆయన 2006 నుంచి 2013 వరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గానూ సేవలందించారు. మానం ఆంజనేయులు 2013లో చైర్మన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగడంతో 20 ఏళ్లపాటు బ్యాంకు డైరెక్టర్గా కొనసాగిన చలసాని రాఘవేంద్రరావు చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 30 ఏళ్లపాటు చైర్మన్గా కొనసాగిన మానం ఆంజనేయులు సారథ్యంలో బ్యాంకు ఆర్థిక లావాదేవీలు కోటి రూపాయల నుంచి రూ.3,169 కోట్లకు చేరగా, చలసాని రాఘవేంద్రరావు హయాంలో రూ.7,263.66 కోట్ల ఆర్థిక కార్యకలాపాలతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంక్గా ఆవిర్భవించింది. రాఘవేంద్రరావును తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సహకార వేత్తలు అభినందనలతో ముంచెత్తారు.
చలసాని రాఘవేంద్రరావు తండ్రి జగన్నాథరావు కృష్ణాజిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు. వీరి కుటుంబం జాతీయ ఉద్యమం నుండి కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చి నాటి నుండి కమ్యూనిస్టు ఆదర్శాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. వీరి సోదరులు చలసాని వెంకట రామారావు కార్మిక రంగంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. రాఘవేంద్రరావు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఉన్నారు. విశాఖ నగర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, జిల్లా సహాయ కార్యదర్శిగా ఆయన గతంలో పనిచేశారు. నూజివీడు ఎస్ఆర్ఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో, కంభంపాడు హైస్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నారు.
అనంతరం ఏలూరులో ఐటీఐ కోర్సు పూర్తి చేసి విశాఖపట్నం హిందుస్థాన్ జింక్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేశారు. ఆ సందర్భంలో జింక్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా కార్మిక రంగంలో విశేష కృషి చేశారు. విశాఖపట్నంలో అనేక కార్మిక సంఘాల నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు.