. కొలిక్కి వస్తున్న సీట్ల సర్దుబాటు
. మిత్రపక్షాలతో కాంగ్రెస్ మంతనాలు
. శరద్ పవార్, ఉద్ధవ్కు రాహుల్ ఫోన్
. మమతతోనూ కాంగ్రెస్ చర్చలు
ముంబై/న్యూదిల్లీ/కోల్కతా: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు వేగవంతమయ్యాయి. సీట్ల విషయమై మిత్రపక్షాలతో ఏకాభిప్రాయానికి రావడానికి కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), శరద్ పవార్ పార్టీతో చర్చలు కొలిక్కి రాగా, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను, మహారాష్ట్రలో శివసేన (యూబీటీ)ను ఒప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మహారాష్ట్రలో ‘ఇండియా’ కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు ముందుకు సాగకపోవటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా రంగంలో దిగారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉండగా 8 సీట్ల విషయమై మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) మధ్య చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ నేపథ్యంలో శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో రాహుల్ ఫోన్లో మాట్లాడారు. ఇద్దరి మధ్య గంటపాటు సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. శరద్ పవార్తోనూ రాహుల్ చర్చించారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి కాంగ్రెస్ మరో అడుగు ముందుకు వేసిందని శుక్రవారం ఆ వర్గాలు తెలిపాయి. అయితే 48 లోక్సభ నియోజకవర్గాలకుగాను ఎనిమిది స్థానాల్లో పురోగతి కనిపించడం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రాంటెక్, హింగోలి, జల్నా, ముంబై నార్త్-వెస్ట్, ముంబై సౌత్-సెంట్రల్, షిర్డీ, భివాండి, వార్ధా స్థానాలకు కాంగ్రెస్, శివసేన (యూబీటీ) పోటీ పడుతున్నాయి. ముంబైలోని ఆరు లోక్సభ స్థానాల్లో ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ వెస్ట్లలో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ముంబైలోని ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్ సెంట్రల్ సహా రాష్ట్రంలోని 18 లోక్సభ స్థానాలకు ఉద్ధవ్ ఠాక్రే పోటీ చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల ఫిరాయింపు తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ముంబై సీట్లలో ఎక్కువ వాటా కోరుతున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు… ఫిబ్రవరి 22న ముంబైలో తదుపరి చర్చల కోసం జరగాల్సిన సమావేశం సీనియర్ నేతలు అందుబాటులో లేకపోవడంతో 27కి వాయిదా పడిరది. అయితే రాజు శెట్టికి చెందిన స్వాభిమాని షెట్కారీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, వామపక్ష పార్టీలు వంటి ఇతర పార్టీలు సీట్ల పంపకాల ప్రక్రియలో పాల్గొంటున్నాయి. ఐదు సీట్లు కావాలన్న వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) అధినేత ప్రకాశ్ అంబేద్కర్ డిమాండ్పైనా జాప్యం జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 ఎన్నికల్లో అంబేద్కర్ పార్టీ 47 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఒక్కటి కూడా గెలవలేకపోయింది. కూటమి సజావుగా సాగేందుకు ఉమ్మడి కనీస కార్యక్రమంతో ఎంవీఏ తమ సీట్ల భాగస్వామ్యాన్ని ఖరారు చేసిన తర్వాత తన ప్రతిపాదనను అందజేస్తానని ప్రకాశ్ అంబేద్కర్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలో 23 స్థానాల్లో పోటీ చేయాలని తాము నిర్ణయించుకున్నామని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పష్టంచేశారు. ముంబైలో నాలుగు సీట్లు సహా మిత్రపక్షాలకు రెండు సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని నొక్కి చెప్పారు. వచ్చే సమావేశంలో ఏకాభిప్రాయం కుదురుతుందని రౌత్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ మధ్య చర్చల తర్వాతే సీట్ల పంపకానికి తుది ఫార్ములా ఖరారు అవుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే స్పష్టం చేశారు. ఎంవీఏలో సీట్ల సర్దుబాటు సూత్రాన్ని పరిశీలిస్తే… కాంగ్రెస్కు 14 సీట్లు, శివసేన(యూబీటీ)కి 15, (వీబీఏ, స్వాభిమాని పార్టీకి ఒక్కొక్కటి కలిపి), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీశరశ్ఛంద్ర పవార్)కి 9గా అంగీకారానికి వచ్చినప్పటికీ... మిగిలిన 8 సీట్లు వివాదాస్పదంగా మారాయి. ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లకు సంబంధించి 17 స్థానాలకు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)తో, దిల్లీలో ఏడిరటిలో మూడిరటికి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ ఇప్పటికే అవగాహనకు వచ్చింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కాంగ్రెస్ తన ప్రయత్నాలు రెట్టింపు చేసింది. కాంగ్రెస్ ఐదు లోక్సభ స్థానాలు అడిగే అవకాశం ఉందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వర్గాలు తెలిపాయి. కానీ మమతా బెనర్జీ మాత్రం రెండు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ‘బైనాక్యులర్లతోనూ మేము కాంగ్రెస్కు మూడవ సీటు కనుగొనలేకపోయాము’ అని తృణమూల్ ప్రతినిధి ప్రకటించారు. ఏకాభిప్రాయం కుదిరితే త్వరలో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఉత్తర బెంగాల్ కంచుకోటలో ఒకటి సహా ప్రస్తుతం బీజేపీ అధీనంలో ఉన్న మూడు స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఆప్
కాంగ్రెస్ పొత్తు ఖరారు
మరోవైపు, నెలల తరబడి చర్చల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ తమ ముందస్తు ఎన్నికల పొత్తును ఖరారు చేసుకున్నాయి. డిల్లీలో మొత్తం ఏడు లోక్సభ స్థానాలు ఉండగా…ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేయనుండగా, కాంగ్రెస్ పార్టీకి దిల్లీలో మూడు స్థానాలు ప్రతిపాదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ‘ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని అధికార బీజేపీ ఊహించలేదు. కేజ్రీవాల్ను రెండు రోజుల్లో అరెస్టు చేసేందుకు సీబీఐ, ఈడీ సిద్ధంగా ఉన్నాయని మాకు సమాచారం ఉంది’ అని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. కాంగ్రెస్ దిల్లీ విభాగం అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ మాట్లాడుతూ ‘ఇండియా’ కూటమిలో ఆప్, కాంగ్రెస్ బలమైన మిత్రపక్షాలని అన్నారు. కూటమి దిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. పొత్తుకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో మీడియాకు అందజేస్తామని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. పొత్తు ఖరారు తుదిదశలో ఉందని దిల్లీ మంత్రి అతిషి చెప్పారు.