తీర్మానం వీటో చేసిన అమెరికా
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ పలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకుంది. తీర్మానంపై ఓటింగ్ సమయంలో అమెరికా వీటో అధికారాన్ని వినియోగించింది. 193 దేశాల సభ్యత్వం గల సమితిలో పలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై గురువారం భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ సందర్భంగా 12 కౌన్సిల్ సభ్యదేశాలు పాలస్తీనా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇక బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. అమెరికా వీటో ఉపయోగించటంతో ఈ తీర్మానం వీగిపోయింది. ‘రెండు దేశాల సమస్య పరిష్కారానికి అమెరికా ఎప్పుడూ మద్దతు ఇస్తుంది. ఈ ఓటు పలస్తీనా ప్రత్యేక దేశానికి వ్యతిరేకమైంది కాదు. అయితే ఇరు దేశాల మధ్య పత్యక్ష చర్చల ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది’ అని ఐరాసలో అమెరికా డిప్యూటీ రాయబారి రాబర్ట్ ఉడ్ భద్రతామండలికి తెలిపారు. కాగా తీర్మానాన్ని అమెరికా వీటో చేయటంపై పలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండిరచారు. ‘పలస్తీనా శాశ్వత సభ్యత్వానికి సంబంధించిన తీర్మానాన్ని అమెరికా వీటో చేయటం అత్యంత అనైతికం, అన్యాయం’ అన్నారు. ఈ తీర్మానంపై ఆమోదం పొందకపోవడం పలస్తీనా ప్రయత్నాన్ని తగ్గించలేదని… తమ ప్రయత్నం ఆగదని అని ఐరాసలో పలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ స్పష్టం చేశారు.