Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

రహదారి ప్రమాదాల నియంత్రణకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టండి

  • జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు

విశాలాంధ్ర – నంద్యాల : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని వైయస్సార్ సెంటినరీ హాలులో జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమీక్షా సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, ఆర్‌టిఓ జి.వి. శివారెడ్డి, డిఎస్పీలు, మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా నంద్యాల జిల్లా పరిధిలోని శాంతిరాం మెడికల్ కళాశాల, చాబోలు క్రాస్, అయ్యలూరు మెట్ట, ఆళ్లగడ్డ లోని అహోబిలం క్రాస్, ఏవి గోడౌన్స్, బలపనూరు క్రాస్ తదితర జాతీయ రహదారుల్లో రహదారి ప్రమాదాల నియంత్రణకు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఎన్హెచ్ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారం రోజుల్లో పనులు పూర్తిచేసి సంబంధిత నివేదికలు సమర్పించాలని ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు. వై జంక్షన్ నుండి ఐటీసీ వరకు లైటింగ్ లేని కారణంగా రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మూడు రోజుల్లో లైటింగ్ ఏర్పాటు చేసి సంబంధిత ఫోటోలను తనకు పంపాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కుందూ నది, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ రద్దీ ప్రాంతాల్లో మూడు రోజుల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి ఎస్ఇ శ్రీధర్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు బిఐఎస్ హెల్మెట్ లనే వాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీవో అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రహదారి ప్రమాదాల్లో ఎవరివో ప్రాణాలు పోతాయని,మొక్కుబడి రీతిలో అప్పగించిన పనులు చేయకుండా పోలీస్, రవాణా, మున్సిపల్ అధికారులు రహదారి నియంత్రణకు సూచించిన పనులను ఖచ్చితంగా పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారుల్లో ఒక్క ప్రమాదం కూడా జరగలేదన్న ఆత్మ సంతృప్తి ఎన్ హెచ్ అధికారులకు ఉండాలన్నారు. భద్రతా సమావేశాల్లో సూచించిన అంశాలను ప్రాధాన్యతగా భావించి నెల రోజుల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ గుర్తింపు సూచికలు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల్లో ప్రమాదాల నియంత్రణకు సూచించిన భద్రతా చర్యలు చేపట్టలేదని జాతీయ రహదారుల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాగే వ్యవహరిస్తే టోల్గేట్ మూసివేతకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. పట్టణంలో ఫుట్ పాత్ లపై దుకాణదారులు ఆక్రమించకుండా పాదాచారులు నడిస్తే రోడ్లపై ప్రమాదాలు నివారించవచ్చని ఇందుకు సంబంధించి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారుల్లో 8 హైవే పెట్రోలింగ్ వాహనాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో గత రెండు సంవత్సరాలతో పోలిస్తే భద్రతా చర్యలు చేపట్టడం వల్ల ప్రమాదాల బారిన పడిన మరణాల సంఖ్యను తగ్గించగలిగామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img