జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డికే కేటాయించాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ స్థానికుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను విన్నవించేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. చిలకం మధుసూదన్ రెడ్డి ఓపెన్ టాప్ కార్లో తన ర్యాలీని నిర్వహిస్తూ ప్రజలకు అభివాదములు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని దుష్ట పాలన నుండి కాపాడాలని పవన్ కళ్యాణ్ ఉద్యమం చేస్తుండగా తాను ధర్మవరం సేవ్ ధర్మవరం పేరుతో ధర్మవరం కాపాడేందుకు పోరాటం చేస్తున్నారని తెలిపారు. వైసిపి అరాచకాలను అడ్డుకున్నందుకు తనపై అనేక అక్రమ కేసులు బనాయించారని వారు వాపోయారు. అష్ట కష్టాలు ఓచి బెదరకుండా ప్రజలకు కార్యకర్తలకు దీటుగా నిలబడ్డారని తనకు పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి పట్ల తనకు అవగాహన ఉందని పార్టీని కూడా బలోపేతం చేస్తానని వారు తెలిపారు. ధర్మవరం ప్రజలు జనసేన పార్టీని కోరుకుంటున్నారని వేల జంటలకు సామూహిక వివాహాలు జరిపించి సామాజిక వేత్తగా పేరు గరించడం జరిగిందన్నారు. 1300 ఎకరాల సొసైటీ భూమిని పేదలకు పంచే క్రమంలో తమ కుటుంబ సభ్యులు ప్రాణ త్యాగాలకు పాల్పడిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఆ భూముల్లోనే పట్టణ పరిధిలోని ఎల్ వన్, ఎల్ టు ఇందిరమ్మ కాలనీలు నిర్మించినట్లు తెలిపారు. ఈ పోరాటంలో తండ్రితో పాటు అనుచరులను బంధువులను పోగొట్టుకున్న విషయాన్ని కూడా వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ తనపై నమ్మకం ఉంచి అనేక పార్టీ పదవులు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఇచ్చారని వారు తెలిపారు. అదే నమ్మకంతో ధర్మారం సీటును జనసేన పార్టీ అభ్యర్థిగా తనకు వచ్చేలా చూడాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. మిత్ర పక్షాలకు సీటు ఇచ్చినందుకు తాను వ్యతిరేకం కాదని ఒక ప్రశ్నకు వారు సమాధానం తెలిపారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మరో ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడటంలో భాగంగా బిజెపి టిడిపి టిడిపి తో కలిసి ఎన్నికలకు పోవాలని పవన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. ధర్మవరం ప్రజలకు తాను ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు తనకు టికెట్టు అవసరమని పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబు నాయుడుకు, పురందేశ్వరికి విజ్ఞప్తి చేసినట్టు వారు తెలిపారు. ఈ భారీ ర్యాలీ కాలేజీ సర్కిల్ నుండి కళాజ్యోతి, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ సర్కిల్, కదిరిగేట్ , తేరు బజార్, అంజుమాన్ సర్కిల్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పవన్ కళ్యాణ్ కి ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేస్తూ నినదించారు. ర్యాలీలో వేలాదిమంది జనులు పాల్గొనడంతో ధర్మవరం జన సందడిగా మారింది.