విశాలాంధ్ర-రాప్తాడు : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వాల్మీకి/బోయ సామాజిక వర్గానికి చెందిన డీఎస్సీకి సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువతీయువకులకు మోడల్ పరీక్ష నిర్వహించడంతోపాటు ఉచిత మెటీరియల్ పంపిణీ చేస్తామని వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్ సీ అక్కులప్ప, ప్రదాన కార్యదర్శి ఎ. చైతన్య కుమార్, కోశాధికారి జి.పవన్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం త్వరలో మెగా డీఎస్సీ విడుదల చేయనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్షకు ప్రిపేరవుతున్న, శిక్షణ పొందుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత విద్యా సంవత్సరం డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణత పొందిన వారికి కూడా ఈ అవకాశం ఇస్తున్నామన్నారు. మోడల్ టెస్ట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను, ఫోన్ నంబరును 94407 74519, 83090 90406 వాట్సాప్ నంబర్లకు పంపాలన్నారు.