ఎస్టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు
విశాలాంధ్ర – విజయనగరం : ప్రామాణికత నిబద్ధతకు విశాలాంధ్ర పత్రిక ప్రతీకగా నిలుస్తుందనీ
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు అన్నారు.విశాలాంధ్ర పత్రిక 72వ వార్షికోత్సవ వేడుకలను విజయనగరం విశాలాంధ్ర కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న డాక్టర్ డివిజి శంకరరావు కేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ విశాలాంధ్ర తో తనకు విడదీయని లేని అనుబంధం వుందని తెలిపారు. విద్యార్ధి దశ నుంచి తనకు పత్రికలు,సాహిత్యం చదివే అలవాటు వుండేదన్నారు. విశాల దృక్ఫధం, ప్రగతిశీల భావన అలవడేందుకు పుస్తక పఠనంతో పాటు పత్రికలు చదవడం ఉపకరిస్తాయన్నారు. విశాలాంధ్ర పత్రిక ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. సామాజిక చైతన్యం, మూఢ నమ్మకాలపై అవగాహన కలిగిస్తూ, గిరిజన బడుగు బలహీన వర్గాలకు అండగా వుంటోందన్నారు.
పత్రికా రంగం రాజకీయ పార్టీలకు కొమ్ముకాయకుండా సామాజిక ప్రయోజనానికి దోహదపడాలని ఆకాంక్షించారు. విశాలాంధ్ర త్వరలో విశాఖ ఎడిషన్ ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు.
విజయవాడ ఎడిషన్ తో ప్రారంభంమైన విశాలాంధ్ర కు బలమైన నెట్ వర్క్ పాత్రికేయులు వున్నారన్నారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి సభ్యులు పి కామేశ్వరరావు తో మంచి అనుబంధం వుందని చెపుతూ
2019లో సిపిఐ అభ్యర్థి గా పాలకొండ నుంచి పోటీ చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
సిపిఐ నాయకులు కామేశ్వరరావు నరసింహులు ఎంతో సహకారించేరని తెలిపారు.సాహితీ రంగానికి విశాలాంధ్ర ఎంతో సేవలందిస్తోందన్నారు. విశిష్ట అతిధి విశాలాంధ్ర విజ్ఞాన సమితి సభ్యులు పి కామేశ్వరరావు మాట్లాడుతూ 1952లో ప్రారంభమైన పత్రిక వెనుక దాసరి చండ్ర రాజేశ్వరరావు
వంటి వారెందరి కృషో వుందన్నారు.తెలుగు రాష్ట్రాల్లోఎందరో పాత్రికేయులను తయారు చేసిన ఏకైక పత్రిక విశాలాంధ్ర పత్రికని కామేశ్వర రావు తెలిపారు. 1970 నుంచి 74 కాలంలో విశాలాంధ్రలో పాత్రికేయునిగా పనిచేసినప్పటి అనుభవాలను పంచుకున్నారు. మహాకవి శ్రీశ్రీ విశాలాంధ్ర లో వుండేవారన్నారు.
ఆయన కవిత్వాన్ని ప్రజలకు విశాలాంధ్ర అందించిందని తెలిపారు. అలాగే చాసో కథలు, సాహిత్యం, గురజాడ రచనలతో పాటు గంటేడ గౌరినాయుడు వంటి వారెందరి సాహిత్యాన్నో ప్రజలకు అందిస్తోందన్నారు. పత్రిక ఆర్ధికంగా బలహీనంగా వున్నా, ప్రజల మద్దతు వుందన్నారు. విశాఖలో ప్రింటింగ్ ప్రెస్ఏ ర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేక అతిథి సమాచార శాఖ సహాయ సంచాలకులు డి రమేష్ మాట్లాడుతూ విశాలాంధ్ర పత్రిక సాహిత్యానికి పెద్ద పీట వేస్తోందన్నారు.
విశాలాంధ్ర విజ్జాన సమితి ,బుక్ హౌస్ ఎంతో భాషా ,సాహితీ సేవ లందిస్తున్నాయన్నారు.
తెలుగు భాషా సాహితీ వేత్తలకు విశాలాంధ్ర తో విడదీయలేని అనుబంధం వుందని చెప్పారు.
72 ఏళ్ల పాటు ఎన్నో ప్రజా ఉద్య మాలకు విశాలాంధ్ర ప్రత్యక్ష సాక్షి గా వుందని తెలిపారు.
గౌరవ అతిథి విశాలాంధ్ర విశాఖపట్నం బ్రాంచ్ మేనేజర్ ఎస్ నరసింహులు మాట్లాడుతూ ఎంతోమంది కృషి తో అనేక ఒడిదుడులను తట్టుకుని విశాలాంధ్ర 72 వసంతాలు పూర్తి చేసుకుని విజయవంతంగా నడుస్తోందన్నారు. ప్రారంభంలో నవతరం ప్రజాశక్తి పేరిట వచ్చిప పత్రిక ప్రభుత్వం నిషేధం తరువాత
1952 జూన్ 22న విశాలాంధ్ర గా ప్రజల ముందుకొచ్చిందన్నారు.
చండ రాజేశ్వరరావు చంద్రం తదితర వామ పక్ష నేతల భావాలతో ప్రజల.పత్రికగా పేరొందిందన్నారు.
కరోనా సమయంలో ఇబ్బందికర పరిస్థితిని తట్టుకుందన్నారు. వ్యాపార దృక్పధం లేకుండా, అక్రమాలు వెలికి ప్రజల పక్షాన పనిచేసే ప్రజల పత్రికగా పేరొందిందని చెప్పారు.ఆత్మీయ అతిథి
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న మాట్లాడుతూ ఫోర్త్ ఎస్టేట్ దేశాభివృద్ధిలో కీలక పాత్రవహిస్తుందన్నారు. పత్రికా రంగానికి రాజ్యాంగం సమున్నత స్థానమిచ్చిందని పేర్కొన్నారు. మిగిలిన మూడు రంగాలు పక్కదోవ పట్టినప్పుడు ఫోర్త్ ఎస్టేట్ వాటిని దోవన పెట్టేందుకు కృషి చేస్తుందన్నారు.ఎన్ జె అక్బర్, రామస్వామి వంటి గొప్ప సంపాదకులు దేశ ప్రధానులను సైతం ప్రశ్నించిన తీరు పత్రికా రంగ ప్రాముఖ్యత ను చెపుతుందన్నారు. విశాలాంధ్ర విజయం వెనుక ఎందరో త్యాగధనులు, కార్మికుల కృషి వుందన్నారు. స్వాతంత్ర్య సమర యోధులు జీవితాలను త్యాగం చేసి విశాలాంధ్ర పత్రికను ముందుకు నడిపించారన్నారు. పేదల కష్టాలను వెలుగులోకి తీసుకువచ్చి సమస్య ల పరిష్కారానికి విశాలాంధ్ర పత్రిక కృషి చేస్తోందన్నారు. విజ్ఞాన సమితి సభ్యులు పి కామేశ్వరరావుతో తనకు మంచి అనుబంధం వుందని గుర్తు చేసుకున్నారు. విశాలాంధ్ర విజయనగరం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బి.నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షత న జరిగిన కార్యక్రమంలో మండల విలేకరులు,సిపిఐ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. సీనియర్ రిపోర్టర్ ఎన్ సన్యాశిరావు మాట్లాడుతూ విశాలాంధ్ర 72వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన అందరీకీ ధన్యవాదాలు తెలిపారు.