విశాలాంధ్ర – పార్వతీపురం : కేంద్ర సాహిత్య,సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్ర సాహిత్య అకాడమి(న్యూ డిల్లీ) వారు ప్రతిఏటా దేశంలోని 24 భాషల్లో ప్రచురించిన పుస్తకాల్లో అత్యుత్తమ పుస్తకాలను ఎంపికచేసి పురస్కారాలను ప్రకటిస్తారు. ఇది దేశంలోనే గొప్పదైన ప్రభుత్వ విశిష్ట పురస్కారంగా రచయితలు భావిస్తారు. శుక్రవారం యువపురస్కారం మరియు బాల సాహిత్య పురస్కారాల విజేతల పేర్లను సాహిత్య అకాడమి ప్రకటించింది. 2023 సంవత్సరం నవంబరు 14 నాడు ప్రదానం చేయబోయే బాల సాహిత్య పురస్కారానికి ప్రముఖ రచయిత డి. కె. చదువుల బాబు వ్రాసిన “ వజ్రాల వాన “ కథల సంపుటి ఎంపిక చేసినట్టు ప్రకటన మరియు జ్యూరీగా వ్యవహరించిన వారి పేర్లను విడుదల చేసింది. పురస్కారానికి పుస్తకాలను ఎంపిక చేసే జ్యూరీలో ఆయాభాషల్లో ప్రముఖులైన ముగ్గురు సాహితీవేత్తలు ఉంటారు. ఈఏడాది సాహిత్యఅకాడమి నియమించిన జ్యూరీలో పార్వతీపురం పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత , కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావుకు చోటు దక్కడం విశేషం.రచయితగా, కవిగా , సాహితీ సేవకుడిగా ప్రముఖులైన నారంశెట్టికి ఈగౌరవం దక్కినందుకు పట్టణంలోని పలువురు ప్రముఖులు,తెలుగు వెలుగు సాహిత్య వేదిక గౌరవ సలహాదారులు అధ్యక్షులు కార్యదర్శులు విశ్లేషకులు అభినందించారు.