. ఈశాన్య రాష్ట్ర పర్యటనలోని సీపీఐ, సీపీఎం ఎంపీలు
. అమెరికా రాయబారి వ్యాఖ్యలకు ఖండన
. అగ్రరాజ్యం జోక్యంతో సమస్య జఠిలమౌతుంది: వినయ్ విశ్వం
ఇంఫాల్ : మణిపూర్ పరిస్థితులను పార్లమెంటులో లేవనెత్తుతామని సీపీఐ, సీపీఎం ఎంపీలు నొక్కిచెప్పారు. ఈశాన్య రాష్ట్రంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చేసిన వ్యాఖ్యలను ఖండిరచారు. హింసతో అట్టుడికిపోతున్న రాష్ట్రంలో శాంతి ప్రక్రియను మొదలు పెట్టాలని సూచించారు. ఈశాన్య రాష్ట్ర ప్రజల బాధతలు పంచుకుంటూ వారికి భరోసానిచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని అమెరికా ఎప్పుడు జోక్యం చేసుకున్నా ఆ సమస్య పెద్దవుతుందేగానీ పరిష్కారం కాబోదని మణిపూర్ అంశంలో అమెరికా ప్రతిపాదనుద్దేశించి సీపీఐ ఎంపీ వినయ్ విశ్వం అన్నారు. రాజకీయ ఆటలకు అమెరికాకు కేంద్రం దారి చూపిందని వ్యాఖ్యానించారు. మే నుంచి రాష్ట్రంలో ఇంటర్నెట్ లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఇలా అయితే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి… పురోగతి ఎలా సాధ్యమని వినయ్ విశ్వం ప్రశ్నించారు. మణిపూర్లో శాంతిని నెలకొల్పేందుకు తక్షణ చర్యలను చేపట్టాలని అధికారులకు సూచించారు. సీపీఎం ఎంపీలు వికాశ్ భట్టాచార్య, జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ మణిపూర్ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. రెండు నెలలుగా రాష్ట్రం రగిలిపోతుంటే ప్రధాని దీని గురించి మాటైనా మాట్లాడలేదన్నారు. ఇది రాష్ట్ర ప్రజలపై పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టంచేస్తుందని అన్నారు. పార్లమెంటులో తప్పక మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతామని భట్టాచార్య చెప్పారు. శాంతి ప్రక్రియను మొదలు పెట్టాలంటే ముందుగా అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని పొందాలని, ప్రస్తుత ప్రభుత్వం దానిని కోల్పోయిందని బ్రిట్టాస్ అన్నారు. ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ రాజీనామా చేయాలన్నారు. ఈ సమస్యలో బీరేన్ సింగ్ భాగస్వామి కాబట్టే దానిని పరిష్కరించలేకపోయారని దిల్లీలో అఖిలపక్ష సమావేశమప్పుడు చెప్పామని గుర్తుచేశారు. ఈనెల 6న కోల్కతాలో విలేకరులతో మాట్లాడిన గార్సెట్టి… మణిపూర్లో హింస, హత్యలు మానవవతాంశమని, భారత్ కోరితే సాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని చెప్పిన విషయం తెలిసిందే.