విశాలాంధ్ర – కర్నూల్ సిటీ : కర్నూల్ నగరాన్ని ఆదర్శ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని పాలకవర్గంతోపాటు అధికారులు గప్పాలు కొట్టుకోవడానికి సరిపోతుందని, ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించలేని స్థితిలో ఎమ్మెల్యే, నగర పాలక సంస్థ పాలకవర్గం, అధికారులు ఉండటం దౌర్భాగ్యం అని సిపిఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం నగరంలోని 17 వ వార్డు ఎన్జీ నగర్ లో డ్రైనేజీ, వాటర్ ట్యాంకు, కరెంట్ పోల్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సిపిఐ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్జీ నగర్ లో కనీస మౌలిక వసతులు లేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఎన్జీ నగర్ లో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి మోటర్ బిగించి తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. అలాగే 5 కరెంటు పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు. వారానికి ఒకసారి మురికి కాలువలు శుభ్రం చేయాలని ఆయన కోరారు. కెసి కెనాల్ కింది భాగంలో కొత్తగా మురికి కాలువలు నిర్మించాలన్నారు. సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించుకోవడానికి రూ5 లక్షలు రుణం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు మహేష్, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.