కొత్త మిత్రుల కోసం ఆరాటం
18న ఎన్డీఏ భేటీకి ఆహ్వానిస్తూ నడ్డా లేఖలు
న్యూదిల్లీ : మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్న వేళ…దీనికి ప్రతిగా ఎన్డీఏ కూడా తన బలాన్ని నిరూపించుకోవడానికి నానాతంటాలు పడుతోంది. పాత, కొత్త మిత్రుల కోసం వెంపర్లాడుతోంది. అందులో భాగంగా జులై 18న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సమావేశమవుతుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా పాత, కొత్త మిత్రులకు బీజేపీ ఆహ్వానం పలుకుతోంది. తాజాగా ఎన్డీఏ సమావేశానికి హాజరుకావాలని కోరుతూ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్ పాశ్వాన్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్, ఇతర కొన్ని పార్టీల అధినేతలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా లేఖలు రాశారు. కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ శుక్రవారం రాత్రి చిరాగ్ పాశ్వాన్తో సమావేశమయ్యారు. నడ్డా రాసిన లేఖను పాశ్వాన్కు అందజేశారు. ఎన్డీఏ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. పాశ్వాన్తో కేంద్రమంత్రి సమావేశం కావడం వారంలో ఇది రెండోసారి. ఎల్జేపీ(ఆర్)ని ఎన్డీఏ అత్యంత కీలక భాగస్వామిగా, మోదీ సర్కారు ప్రభుత్వం దేశాభివృద్ధి, పేదల సంక్షేమంలో భాగస్వామిగా నిలిచిందని నడ్డా అభివర్ణించారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఎక్కువ పార్టీలను ఎన్డీఏలో భాగస్వాములను చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీవర్గాలు తెలిపాయి. అందుకే కొన్ని పార్టీల నేతలకు నడ్డా లేఖలు రాసినట్లు వెల్లడిరచాయి. బీహార్ మాజీ సీఎం, హిందుస్తానీ అవామ్ మోర్చా నేత జితన్ రామ్ మాంజీకి లేఖ రాశారు. నడ్డా ఆహ్వానం మేరకు 18వ తేదీ నాటి సమావేశానికి హాజరవుతున్నట్లు మాంజీ తనయుడు సంతోశ్ కుమార్ సుమన్ పీటీఐకి చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, ఎన్సీపీ చీలికవర్గం నేత అజిత్ పవార్తో పాటు బీహార్, యూపీలోని చిన్నా చితకా పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలకు వరుసపెట్టి లేఖలు రాస్తున్నారు. ఆ పార్టీలన్నీ ఎన్డీఏ భేటీకి హాజరవుతాయని భావిస్తున్నారు. ప్రధాని నరేందద్రమోదీ హాజరయ్యే ఈ సమావేశం ద్వారా బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవాలని కోరుకుంటున్నది. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇంతపెద్దస్థాయిలో ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఓ పక్క ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం, మరోపక్క బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న శివసేన(ఉద్ధవ్), శిరోమణి అకాలీదళ్, జేడీయూ వంటి కీలక పార్టీలు ఎన్డీఏకు దూరం కావడంతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయినట్లు కనిపిస్తోంది. ఈ సమావేశం ద్వారా కొత్త మిత్రులను దగ్గరకు చేర్చుకొని బలప్రదర్శన చేయాలని భావిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీఏకు దూరమైన చిరాగ్ పాశ్వాన్ పార్టీని దగ్గర చేసుకోవడానికి బీజేపీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. తన బాబాయి పశుపతి కుమార్ పరాస్కు కేంద్రమంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా ఎల్జేపీని బీజేపీ చీల్చిందన్న కోసం చిరాగ్ పాశ్వాన్లో ఉంది. అందుకే ఇంతకాలం నుంచి ఆయన బీజేపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చిరాగ్ పాశ్వాన్ను దగ్గరకు చేర్చుకోవడం ద్వారా బీహార్లో ఎస్సీ ఓట్లు పొందాలని బీజేపీ అనుకుంటున్నది.