విశాలాంధ్ర- కర్నూల్ సిటీ: కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు కమిషనర్ మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు 1వ తేదీన కార్పొరేటర్లలో 5 మందిని స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. జులై 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) కార్యాలయంలో నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు.ఎన్ని నామినేషన్లు దాఖలైంది జులై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటిస్తారు. జూలై 25వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కమిషనర్ నామినేషన్లు స్క్రూటినీ చేస్తారు.అర్హత కలిగిన నామినేషన్ల వివరాలు అదే రోజు ప్రకటిస్తారు. ఉపసంహరణకు జులై 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. పోటీలో మిగిలిన అభ్యర్థుల వివరాలు అదేరోజు ప్రకటిస్తారు. ఆగస్టు 1వ తేదీ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ పాత కౌన్సిల్ హాల్లో పోలింగ్ జరుగుతుంది. అదేరోజు పోలింగ్ ముగిశాక 3 గంటల తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.