విశాలాంధ్ర కొయ్యలగూడెం: రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు అంతం పలకాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి అన్నారు. గురువారం ఆమె స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై అసభ్యకరంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదని, మహిళా సమస్యలపై పోరాటం చేస్తుంటే స్పందించలేక మహిళలపై అసభ్య పదజాలంతో దూషిస్తూ కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. మహిళలపై రోజురోజుకు హింస పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధం పై తొలి సంతకం చేస్తానని జగన్ వాగ్దానం చేసి స్వయంగా ప్రభుత్వమే మద్యం అమ్మడం దుర్మార్గం అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి ఇకనైనా తన మొండివైఖరి విడనాడి మహిళా పక్షపాతిగా నిరూపించుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో రాబోయే ఎన్నికలలో వైసీపీని మహిళలు చిత్తుచిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సావిత్రి, పద్మ, కొత్త రమ,గౌరీ పాల్గొన్నారు.