జనసేన అధినేత పవన్ కల్యాణ్
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఓటర్ల తనిఖీలో వాలంటీర్లు పాల్గొనడం చట్ట విరుద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ఓటర్ల తనిఖీ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొన్న దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో పవన్ స్పందించారు. ఓటర్ల తనిఖీలో ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. ‘ఓటరు జాబితా తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు మొత్తం ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడమే ప్రజస్వామ్యానికి నిజమైన అర్థం. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, బూత్ స్థాయి అధికారులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, వాలంటీర్లు ఇంటింటి సర్వే ప్రక్రియలో భాగమవుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఏపీలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిరది. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, ఏపీలో అవసరమైన నిబంధనలు తక్షణమే అమలు చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని జనసేన డిమాండ్ చేస్తోంద’ని వపన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఆర్భాటాలు మాని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించండి: బైజూస్ను చూపించి రాష్ట్ర ప్రభుత్వం ఏదో సాధించినట్లు గొప్పలు చెప్పుకుంటోందని, ముందు పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని పవన్ మరో ట్వీట్ చేశారు. ‘మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఊసే లేదు. ఉపాధ్యాయుల భర్తీ చేపట్టలేదు. వారికి కనీస శిక్షణ ఇవ్వడం లేదు. నష్టాలు వచ్చే స్టార్టప్కు మాత్రం కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. టెండర్ కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి. ఆ కంపెనీల ప్రమాణాలను ఎవరు పరిశీలించారు. వాటికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో ఉంచారా? టెండరు, కంపెనీ ఎంపిక అంశాలపై ప్రభుత్వం స్పందించాల’ని డిమాండ్ చేశారు.