విశాలాంధ్ర-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్ల మోసానికి పాల్పడిన ముఠాని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సీపీ ఆనంద్ శనివారం మీడియాకు తెలిపారు. ఈ తరహా మోసాల బారిన పడిన వారు 15 వేల మంది ఉన్నారన్నారు. టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఆన్లైన్లో టాస్క్ల పేరుతో మొదట డబ్చులిచ్చి ఆ తర్వాత పెట్టుబడుల నెపంతో మోసం చేస్తున్నారని, ఉన్నత పదవుల్లో ఉన్న వారు సైతం బురిడీ కొడుతున్నారని అన్నారు. బాధితుల్లో ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. బాధితుడు శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును చేదించినట్లు చెప్పారు. షెల్ కంపెనీల ద్వారా చైనా, దుబాయ్ నుంచి మోసాలను జరుగుతున్నట్లు తెలిపారు. ఆ దేశాల్లో ఉన్న ప్రధాన నిందితులకు భారత్లో సహకరిస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశామన్నారు. వారికి సంబంధించిన ఖాతాల్లోని డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా బదిలీ చేసుకుని చైనా, దుబాయ్లో విత్డ్రా చేస్తున్నారని తెలిసిందని అన్నారు. ఎన్ఐఐ వాళ్లకి ఈ కేసు గురించి సమాచారం ఇచ్చామని, వారు జోక్యం చేసుకోవచ్చునన్నారు. హిజ్బుల్ టెర్రర్ మోడ్యూల్కి క్రిప్టో కరెన్సీ బదిలీపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనున్నట్లు సీపీ ఆనంద్ తెలిపారు.