. స్వాతంత్య్ర సమరయోధుని భార్య సజీవ దహనం
. మే28న ఘటన
. మణిపూర్లో అమానుషాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి
సీరౌ : మణిపూర్లో అమానుషాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మహిళల నగ్న ఊరేగింపు, సామూహిక అత్యాచారం ఘటనను మరువక ముందే స్వాతంత్య్ర సమరయోధుడు ఎస్.చుర చాంద్ సింగ్ సతీమణి ఇబెటోంబి (80)ను ఇంట్లో బంధించి, నిప్పు పెట్టి సజీవంగా దహనం చేసిన హృదయ విదారక ఘటన బయట పడిరది. ఈ ఘటన కక్చింగ్ జిల్లా, సిరౌ గ్రామంలో మే 28వ తేదీ మధ్యరాత్రిలో జరిగింది. రాష్ట్రం అట్టుడికి పోతున్న సమయంలో ఈ అమానుషం జరిగినట్లు సిరౌ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సాయుధ గుంపు ఈ పాశవికానికి పాల్పడినట్లు వెల్లడైంది. బాధితురాలి మనుమడు ప్రేమ్కాంత (22) మీడియాతో మాట్లాడుతూ ‘ఆ రోజు మాపై దాడి జరిగినప్పుడు పారిపోండి… ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి తర్వాత నా కోసం రండి అని అవ్వచెప్పింద’ని అన్నారు. రెప్పపాటులో మృత్యువను తప్పించుకున్నట్లు చెప్పారు. అవ్వను కాపాడే ప్రయత్నంలో తన చేతికి, కాలికి బుల్లెట్లు తగిలా యన్నారు. ‘నా కోసం తిరిగి రండి’ అన్నవే ఆమె చివరి మాటలని భావోద్వేగానికి గురయ్యారు. ‘తెల్లవారుజామున 2.10గంటలకు మేమంతా పారిపోయాం. మాతో రమ్మని అవ్వ వినలేదు. ముందు మీ ప్రాణాలను కాపాడుకోండి తర్వాత నా కోసం రండి అన్నారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే ఇంట్లో ఆశ్రయం పొందాం. అన్ని వైపుల నుంచి కాల్పులు జరుగుతుండటంతో ప్రాణ భయంతో వణికిపోయాం. కాస్త ధైర్యం తెచ్చుకొని ఉదయం 5.30`6 గంటలప్పుడు అవ్వ కోసం తిరిగొస్తే బూడిదైన ఇల్లు కనిపించింది’ అని తెలిపారు. ఆ కళారాత్రి మిగిల్చిన గాయాల నుంచి నేటికీ కోలుకోని ప్రేమకాంత, హింస జరిగిన రెండు నెలల తర్వాత ఊరికి వస్తే తన ఇంటి స్థానంలో కాలిపోయిన చక్క ముక్కలు, రేకులు కనిపించాయి. శిథిలాల్లో అవ్వ చిత్రపటంతో పాటు తన తాతను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సన్మానించిన ఫొటో లభించాయి. ఇబెటోంబి మంచం ఉండే స్థలంలో ఆమె అస్తికలు చెల్లాచెదురుగా పడివున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు 45కిమీల దూరంలోని సిరౌ గ్రామంలో హింస జరిగినప్పుడు సాయుధ గుంపులు ఇళ్లకు నిప్పు పెట్టాయి. ఇష్టమొచ్చిన కాల్పులు జరపడంతో ఇళ్ల గోడలకు తూటా చిల్లులు పడ్డాయి. హింస వల్ల అత్యధిక ప్రభావితమైన గ్రామం ఇదే కాగా కొద్ది దూరంలోని మార్కెట్ దెయ్యాల దిబ్బగా మారింది. అక్కడ చావునిశబ్దం తప్ప ఏమీ మిగలలేదు.