మళ్లీ పెరుగుతున్న యమున నీటిమట్టం
న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీలో యుమునా నది ప్రవాహం ఆదివారం మరోసారి ప్రమాదకరస్థాయి (205.33 మీటర్లు)ని దాటింది. దీంతో మరోసారి దిల్లీలో అనేక ప్రాంతాల్లో వరదలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజ్ నుంచి నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో యుమునా నదిలో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. దిల్లీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక, పునరావాస కార్యక్రమాలపై ఈ వరద ముప్పు ప్రభావం చూపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘‘హత్నికుండ్ బ్యారేజ్ నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల దిల్లీలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు దిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని దిల్లీ మంత్రి అతిషీ చెప్పారు. కుండపోత వర్షాల కారణంగా యమునా నది నీటి మట్టం గత వారం అత్యధి కంగా 208.05 మీటర్లకు చేరింది. గత కొద్దిరోజులుగా నీటి మట్టం 205.02 మీటర్లుగా ఉంది. తాజాగా హత్నికుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయ డంతో ఆదివారం ఉదయం నీటిమట్టం 206.07 మీటర్లకు చేరుకుంది. మరోవైపు జులై 25 వరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా సహా యమునా ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు వరదలకు కారణమయ్యాయి. వరదల కారణంగా 27,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసినట్లు అధికారులు తెలిపారు.
బీహార్, బెంగాల్, రాజస్తాన్తో పోలికా?
కుప్పకూలిన మణిపూర్ ప్రభుత్వం కోమాలో కేంద్రం: చిదంబరం న్యూదిల్లీ: మణిపూర్లో పరిస్థితిని బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాలతో బీజేపీ పోల్చడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆక్షేపించారు. మణిపూర్లో ప్రభుత్వం కుప్పకూలిందని, కేంద్ర ప్రభుత్వం స్వయంగా విధించుకున్న కోమాలో ఉందని విమర్శించారు. మణిపూర్పై చర్చ నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉందని దుయ్యబట్టారు. మే4న మణిపూర్లో వెలుగుచూసిన అమానవీయ ఘటన క్రమంలో బీహార్, బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాల్లో మహిళలపై నేరాలు ఎక్కువని బీజేపీ ఆరోపించింది. వీటి గురించి విపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. దీంతో అధికార
విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిదంబరం ట్విట్టర్ మాధ్యమంగా బీజేపీ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాల్లో మహిళలపై హింస జరిగిందనే అనుకుందాం. మరి మణిపూర్లో కొనసాగుతున్న హింసను ఎలా సమర్థించు కుంటారు? లోయ ప్రాంతంలో అసలు కుకీలు మిగిలివున్నారా? చురచాంద్పూర్తో పాటు ఇతర గిరిజిల్లాల్లో మయితె వర్గీయులు ఉన్నారా? అని ప్రశ్నించారు. తాజా వార్తాలను బట్టి మణిపూర్లో గిరిజన వర్గాలను తరిమేసినట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. మణిపూర్లో ప్రభుత్వం కుప్పకూలిందని, కేంద్రప్రభుత్వ సొంతంగా విధించుకున్న కోమా ఉందని చిదంబరం నొక్కిచెప్పారు. ఈశాన్య రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల అధికారం వారి ఇళ్లకే పరిమితమన్నట్లుగా పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మణిపూర్ను బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్తో ఎలా పోలుస్తారని బీజేపీని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్నది అసమర్థ, వివక్షపూరిత ప్రభుత్వమని దుయ్యబట్టారు. మణిపూర్లో అరాచకత్వానికి దీనిని సాగుగా చూపలేరని చిదంబరం వ్యాఖ్యానించారు.
మణిపూర్పై పార్లమెంటులో
ప్రధాని ప్రకటన చేయాలి: ఫరూక్
శ్రీనగర్: హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో మాట్లాడాలని, ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడిరచాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘ప్రపంచం మొత్తం మణిపూర్ పరిణామాలపై మాట్లాడుతోంది… పీఎం ఈ అంశంపై చాలా బలమైన పదాలను ఉపయోగిస్తూ మాట్లాడారు… అయితే ప్రధాని దానిని పార్లమెంటులో చెప్పాలి. ఆయన మాట్లాడిన తర్వాత ప్రతిపక్షం చెప్పేది కూడా కూడా వినాలి. పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడేందుకు అనుమతిస్తారని ఆశిస్తున్నాం. మా లక్ష్యం విమర్శించడం కాదు, పరిస్థితి గురించి మా భావాలను వ్యక్తపరచడం’ అని అబ్దుల్లా ఆదివారం ఇక్కడ విలేకరులతో అన్నారు. మణిపూర్లో ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై ప్రశ్నించగా… ‘మణిపూర్ మనందరికీ విషాదం… ఇది ప్రతి భారతీయునికి అత్యంత దుర్దినం’ అని అబ్దుల్లా అన్నారు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన 140 కోట్ల మంది భారతీయులకు సిగ్గుచేటని, చట్టం తన పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేస్తుందని, దోషులను వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ గురువారం అన్నారు. అధికారం కోసం కొందరు వ్యక్తులు ప్రజల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని అబ్దుల్లా అన్నారు. ‘ప్రజలను విభజించే అటువంటి శక్తిని నేను తృణీకరిస్తున్నాను. దేవుడు ఒక్కడే…అతను అందరికీ చెందినవాడు. మీరు అతన్ని ఏ రూపంలో చూడాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. మీరు అతన్ని గుడిలో లేదా మసీదులో చూడాలనుకుంటున్నారు. అతను ఒక్కడే మిగిలాడు. అయినా మనం విభజించబడుతున్నాము. ఇది విచారకరం’ అని ఫరూక్ అన్నారు.
గుజరాత్ సీజేగా సునీతా అగర్వాల్ ప్రమాణం
అహ్మదాబాద్: గుజరాత్ హైకోర్టు 29వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సునీతా అగర్వాల్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె గుజరాత్ హైకోర్టుకు రెండో మహిళా ప్రధాన న్యాయమూర్తి. గాంధీనగర్లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సునీతా అగర్వాల్ చేత ప్రమాణం చేయించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి, న్యాయశాఖ మంత్రి రుషికేష్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అగర్వాల్ నియామకాన్ని సుప్రీంకోర్టు కొలీజియం జులై 5న ప్రతిపాదించింది. ప్రస్తుతం దేశంలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో మహిళలెవరూ లేరు. సునీతా అగర్వాల్కు ముందు జస్టిస్ సోనియా గోకానీ ఫిబ్రవరి 25, 2023న పదవీ విరమణ చేయడానికి ముందు కొన్ని రోజులు గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు, ఆ తర్వాత జస్టిస్ ఏజే దేశాయ్ తాత్కాలిక సీజేగా పనిచేశారు. ఏప్రిల్ 30, 1966న జన్మించిన జస్టిస్ అగర్వాల్ 1989వ సంవత్సరంలో అవధ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుల య్యారు. ఆమె డిసెంబరు 16, 1990న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. అలహాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. నవంబర్ 21, 2011న, ఆమె అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.