విశాలాంధ్ర – కర్నూలు సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రూ 2లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ10 వేల చొప్పున రైతుకు,కౌలు రైతుకు పెట్టుబడి సాయం ప్రకటించాలని ఏపీ రైతు సంఘం కర్నూలు జిల్లా సమితి డిమాండ్ చేసింది.శనివారం కర్నూలు సీ.ఆర్. భవన్ (సీపీఐ)లో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.జగన్నాథం, సిపిఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, సిపిఐ నగర సహాయ కార్యదర్శులు మహేష్, దంభోళమ్.శ్రీనివాసులు, నాయకులు రామాంజనేయులు,బాబయ్యలు గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు అప్పుల పాలయ్యారన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేని కారణంగా ఏ పంట పండించే రైతు కూడా లాభాల్లో లేడని ఆయన తెలిపారు.రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల పంటలు కొనుగోలు చేస్తామని చెప్పిన సీఎం ఎక్కడా కొనుగోలు చేయడం లేదన్నారు. రైతు భరోసాలు పేరుకు మాత్రమే దర్శనమిస్తున్నాయని దుయ్యబట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. రైతులకు వర్తించే అన్ని రకాల సబ్సిడీలు, సంక్షేమ పథకాలు, పంట రుణాలు ,రుణమాఫీ,జలకళ కౌలు రైతులకు వర్తించే విధంగా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టుల ఊసేఎత్తడం లేదని విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారానికి ఆగస్టు 7న చలో విజయవాడకు జిల్లా నుండి రైతులు, కౌలు రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహా ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.