దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – ఎయిమ్స్లో అగ్నిప్రమాదం జరిగింది. పాత ఓపీడీ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ రూమ్లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ కమ్ముకుని బయటికి వచ్చింది. ఒక్కసారిగా ఫైర్ యాక్సిడెంట్ అయి.. భారీగా పొగ రావడంతో ఏం జరుగుతోందో అక్కడ ఉన్న వారికి తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రాణ భయంతో పేషంట్లు, వారితో వచ్చిన వారు, ఆస్పత్రి సిబ్బంది.. భయాందోళనతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదం తర్వాత పేషంట్లను అక్కడి నుంచి తరలించారు. తాత్కాలికంగా ఎమర్జెన్సీ వార్డును మూసివేశారు. అయితే ఆ ఎండోస్కోపీ రూమ్ కింది అంతస్తులోనే ఎమర్జెన్సీ వార్డు కూడా ఉండటంతో ఆస్పత్రిలో ఉన్న పేషంట్లు, సిబ్బంది, డాక్టర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు రాగానే ఫైర్ అలారమ్ మోగడంతో సిబ్బంది అప్రమత్తమ్యయారు.ఎయిమ్స్లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 6 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను పూర్తిగా అదుపు చేసినట్లు వెల్లడించారు.