విశాలాంధ్ర-రాప్తాడు : హిందూ, ముస్లింలు సంయుక్తంగా మొహర్రం వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకున్నారు. మండలంలోని రాప్తాడు, పుల్లలరేవు గ్రామాల్లో వారం రోజులుగా పీర్ల చావిడి లో కొలువుదీరిన పీర్ల దేవుళ్ళ కు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు స్వాములకు చక్కెర, ఎండు కొబ్బర్లు, బెల్లం పానకం వంటి వాటిని సమర్పించి మొక్కులు తీర్చుకున్నా రు. వేడుకల్లో భాగంగా ఆయా గ్రామాల్లోని యువకులు పీర్ల చావిడి వద్ద ఏర్పాటు చేసిన పీర్ల గుండం చుట్టూ చిందులు వేస్తూ సంబరాలను జరుపుకున్నారు. ముందుగా ఆయా గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున పీర్ల దేవుళ్ళను గ్రామ పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తదనంతరం సాయంకాలం గ్రామ పెద్దల సమక్షంలో యువకులు చిందులు వేస్తుండగా కొలువుదీరిన పీర్ల దేవుళ్లను డప్పులు, మంగళ వాయిద్యాల మధ్యన జలధికి తీసుకెళ్లారు. మొహర్రం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా ఇటుకులపల్లి సీఐ నరేంద్రరెడ్డి ఆధ్వర్యం లో ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.