అనంతపురం జిల్లా
విశాలాంధ్ర-రాప్తాడు : దశాబ్దాలుగా చిన్నారుల ఆలనాపాలనా చూస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ జిల్లా నాయకురాలు రమాదేవి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైవీ శివారెడ్డి ఇంటి దగ్గర నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు సీఐటీయూ జిల్లా నాయకులు ఆర్వీ నాయుడు, రామాంజినేయులు, పోతులయ్యలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. రాష్ట్రప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ, అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టడం దుర్మార్గపు చర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని అన్నారు. టీఎలు, డిఏలు ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, కనీస వసతులు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే మా సమస్యలను పరిష్కారం చేసేంతవరకు నిరవధిక సమ్మెలో కొనసాగుతామని హెచ్చరించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి నరసయ్యకు వినతిపత్రం అందజేశారు.