పాడేరు నియోజకవర్గ తెదేపా ఇన్చార్జి ఈశ్వరి.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – అంగన్వాడి ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని పాడేరు నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు. గురువారం చింతపల్లి పర్యటనకు విచ్చేసిన ఆమె పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో అంగన్వాడి లు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో ఆ పార్టీ అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి, అరకు పార్లమెంటు బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం, పార్టీ శ్రేణులతో కలసి కూర్చొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీల నుద్దేశించి ఆమె మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాలంలో అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, శిశు సంక్షేమ శాఖను మరింత మెరుగుపరచి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి నేడు అంగన్వాడి ఉద్యోగులకు మొఖం చాటేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలలో ప్రజల, ఉద్యోగ సమస్యలు 20 శాతం కూడా వైకాపా ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. ఈ నెల 21న చింతపల్లి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజన ప్రాంత ఉద్యోగులకు కానీ, గిరిజన ప్రాంతాభివృద్ధికి గాని భరోసా కల్పించకుండా వెళ్లిన సంగతి ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. ముఖ్యమంత్రి మన్య ప్రాంతంలో పర్యటనలో గిరి పుత్రులకు ప్రత్యేక నిధులు ప్రకటించారా, గిరిజనుల పక్షపాతి అంటే ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రాబోవు ఎన్నికలలో గద్దె దించి ఉద్యోగులు, ప్రజలు బహుమతిగా ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో ఉద్యమిస్తున్న అంగన్వాడి లు పాల్గొన్నారు.