నిర్భాగ్యుడైన. చంద్రమోహన్ కుటుంబానికి భరోసా కల్పించిన తెదేపా నాయకులు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- సాక్షి పత్రిక మాజీ పాత్రికేయుడు కిలో చంద్రమోహన్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని తెదేపా మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు అన్నారు. కీళ్ల సంబంధ వ్యాధితో బాధపడుతూ ఇంటికే పరిమితమైన చంద్రమోహన్ కుటుంబాన్ని ఆ పార్టీ అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం, గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్ లతో కలిసి నూతన సంవత్సరపు వేళ ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రమోహన్ ఆరోగ్య పరిస్థితిని, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నలుగురు సంతానం కలిగిన చంద్రమోహన్ నరాలు, కీళ్ల సమస్యలతో గడచిన కొన్నేళ్లుగా ఇంటికే పరిమిత మవ్వడమే గాక, ఆరోగ్యపరంగానే గాక, ఆర్థికంగానూ చితికి పోయారు. ఈ క్రమంలో ఆయన సతీమణి పద్మ ఆశా కార్యకర్తగా పనిచేస్తూ తనకు వచ్చే నాలుగు వేల రూపాయలు, తన భర్తకు వచ్చే వికలాంగ పెన్షన్ 3000 రూపాయలతో కుటుంబాన్ని పోషిస్తూ ఆర్థికంగానే గాక, మానసికంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చంద్రమోహన్ సతీమణి పద్మ ఆయన దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఆయన మాట్లాడుతూ చింతపల్లిలో సాక్షి దినపత్రికకు మొట్టమొదటి పాత్రికేయునిగా సేవలందించిన చంద్రమోహన్ ఈ విధంగా అనారోగ్యానికి గురి కావడం, చిన్న వయసులోనే ఇటువంటి వ్యాధి బారిన పడడం బాధాకరమన్నారు. ఇటువంటి దీనస్థితిలో ఉన్న చంద్రమోహన్ ను, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన వైకాపా ప్రభుత్వం ఆయనను విస్మరించడం అన్యాయం అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం ఇటువంటి ఎంతోమందికి వరమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటువంటి నిర్భాగ్యులకు, నిరుపేద కుటుంబాలకు అండగా ఉండేందుకు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ బూత్ కన్వీనర్ లు కోటేశ్వరరావు, నాగు తదితరులు పాల్గొన్నారు.