. వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తులు
. వారిని బుజ్జగిస్తున్న నేతలు
. ఎస్సీ మహిళా ఎమ్మెల్యే పద్మావతి ఆవేదన
. క్యాంపు కార్యాలయానికి పార్థసారథి
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పులతో ఒకవైపు అసంతృప్తులు పెరిపోతుంటే, మరోవైపు బొజ్జగింపుల పర్వం కొనసాగు తోంది. తుది విడత జాబితాలో ఎవరికి టికెట్లు వస్తాయో, రావో అని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలను సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. విడతల వారీగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను భారీగా మార్పులు, చేర్పులు చేసేందుకు అధిష్ఠానం సిద్ధమైంది. ఇప్పటికే మొదటి, రెండు దశల్లో 38 స్థానాలను అధిష్ఠానం మార్చింది. మొత్తంగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పుల సంఖ్య 67కు చేరనుందని సమాచారం. తొలి జాబితాలో 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, రెండో జాబితాలో 28 మందితో ఎమ్మెల్యే, ఎంపీల జాబితాను విడుదల చేశారు. తుది జాబితా (మూడో విడత) లో దాదాపు 29 మంది వరకు ఉంటారని సమాచారం. ఇందులో 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కాగా, మిగిలిన వారంతా ఎంపీ అభ్యర్థులుగా ఉండే అవకాశం ఉంది. ఈ మార్పులతో కొందరి సిట్టింగ్లకు ఉద్వాసన, కొత్తవారికి ఛాన్స్ లభించనున్నది. ఈ జాబితాల ప్రకటనతో టికెట్లు దక్కక అసంతృప్తికి గురైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన వారిలో కొంతమంది ఎమ్మెల్యేలను అధిష్ఠానం బుజ్జగించే పనిలో ఉండగా, కొందరు ఇంకా అలకలు, అసంతృప్తులు వీడలేదు. ఇంతవరకు సమీక్షించని జిల్లాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోనూ అభ్యర్థులను మార్చేందుకు నిర్ణయించారు. ప్రధానంగా సామాజిక సమీకరణలు, గెలుపు గుర్రాలకే సీఎం ప్రాధాన్యతిస్తున్నారు.
టికెట్ల దక్కదనే ఆవేదనలు
తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఎస్సీ మహిళా ఎమ్మెల్యే జొన్నగడ్డల పద్మావతి ఏకంగా సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోను విడుదల చేయడం చర్చనీయాంశమైంది. తన నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ ఏ మాత్రం సహకరించడం లేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి తదితరులపై ఆమె ఆరోపణలు చేశారు. నీటి కోసం ఎన్నాళ్లు పోరాటం చేయాలంటూ వాపోయారు. తనకు టికెట్ ఇవ్వాలని సీఎంను అభ్యర్థించినట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కూడా టికెట్ దక్కదనే ప్రచారంతో ఆందోళనలో ఉన్నారు. దీంతో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలతో సీఎం జగన్ జాగ్రత్తగా ఉండాలంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. శంకర నారాయణను చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలని అధిష్ఠానం సూచించగా, అప్పటి నుంచి ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అనుచరులను కలుస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి సీటు లేదనే ప్రచారంతో ఆయన పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డికి పిలుపు వచ్చింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్, ఎమ్మెల్యేలు ఎలిజా, అరణి శ్రీనివాసులు, నాగార్జునరెడ్డి, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి తదితరులకు పిలుపు రావడంతో తాడేపల్లికి చేరుకున్నారు. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డిని, అసమ్మతి నేతలను క్యాంపు కార్యాలయానికి పిలిపించి వారితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఆయనతో పాటు సమన్వయకర్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, కైలే అనిల్ తదితరులున్నారు. ఇటీవల పెనమలూరులో జరిగిన సామాజిక సాధికార సదస్సులో సీఎం జగన్ గుర్తించడం లేదంటూ పార్థసారథి ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే. అనంతరం టీడీపీలోకి పార్థసారథి వెళతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. వైసీపీ నేతలకు ఆయన టచ్లో లేకుండా వెళ్లిపోయారు. మంత్రివర్గ విస్తరణలో రెండు విడతలుగా ఆయనకు చోటు దక్కపోవటం పైనా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వారిందరినీ వరసవారీగా వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నారు.