ఎన్నికల సంఘానికి జైరామ్ రమేశ్ లేఖ
న్యూదిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)ల విషయంలో తమ ఆందోళనలను ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. తమ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ప్రధానాధికారి రాజీవ్కుమార్కు ఆయన మరో లేఖ రాశారు. ఇప్పటికే డిసెంబర్ 30న ‘ఇండియా’ కూటమి తరపున తాను రాసిన లేఖకు ఈసీ ఇచ్చిన సమాధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆ మేరకు ఈసీ సమాధానాన్ని తప్పుపడుతూ మరో లేఖ రాశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్పై నెలకొన్న సందేహాలపై చర్చించి, అవసరమైన సలహాలు ఇవ్వడం కోసం తాను గత లేఖలో ఈసీతో భేటీకి సమయం కోరానని, కానీ ఈసీ తన డిమాండ్ను అంగీకరించలేదని, పైగా వారి అధికారిక వెబ్సైట్లోని ఎఫ్ఏక్యూ చదువుకుని సందేహాలు నివృత్తి చేసుకోవాలంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిందని జైరామ్ రమేశ్ ఆరోపించారు. ఈసీ అధికారిక వెబ్సైట్లోనూ మా ప్రశ్నలకు సమాధానాలు లేవని తెలుపగా.. మా ప్రశ్నలే తప్పుడువని ఈసీ నిర్ధారణ చేసిందని జైరామ్ రమేశ్ విమర్శించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్పై ప్రజల సమక్షంలో చర్చ జరగాలని మేం ఎందుకు పట్టుబట్టడుతున్నామో.. ఈసీ సమాధానం స్పష్టం చేస్తోందని ఆయన చెప్పారు. అందుకే తాము ఈవీఎంలు, వీవీప్యాట్స్ పనితీరుపై సందేహాలు లేవనెత్తుతున్నామన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఈసీకి రాసిన లేఖను ఎక్స్లో పోస్ట్ చేశారు.