సంకేతాలు అందుబాటులోకి రావడంతో ఆనందంలో బలపం పంచాయతీ ప్రజలు
విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా ) :- మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ముద్రపడి తరతరాలుగా అభివృద్ధికి ఆమడ దూరాన ఉన్న బలపం పంచాయితీ కోరుకొండ గ్రామంలో ఎట్టకేలకు ఎయిర్టెల్ టవర్ అందుబాటులోకి రావడంతో బలపం పంచాయతీ ప్రజలకు సమాచార వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉన్న కారణంగా మునుపెన్నడూ ఏ పాలకులు, అధికారులు ఆ పంచాయతీలో పర్యటించే సాహసం చేయలేక పోయేవారు. తరాలు మారుతున్నా, స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఆ పంచాయతీ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ క్రమంలో వైకాపా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నాటి నుంచి పాడేరు శాసన సభ్యురాలు కొటగుళ్లి భాగ్యలక్ష్మి, అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐ టీ డీ ఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్, చింతపల్లి ఏ యస్ పి ప్రతాప్ శివ కిషోర్ లు ఆ పంచాయతీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తుఫాన్ కు సైతం లెక్కచేయకుండా జోరు వానలో స్థానిక సర్పంచ్ రమేష్ నాయుడు, ఎంపీటీసీ సభ్యురాలు బచ్చల మచ్చమ్మలతో పాటు మండలంలోని ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో పర్యటించి సమస్యలు తెలుసు కోవడమే గాక ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించడంతో కలెక్టర్ , పీ వో, ఏ యస్ పీ ల చొరవతో ఎట్టకేలకు ఆ పంచాయతీలో సమాచార వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ లు సహా పంచాయతీలోని అన్ని గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, కలెక్టర్ సుమిత్ కుమార్, పీ వో అభిషేక్, ఏ యస్ పీ ప్రతాప్ శివ కిషోర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.