జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ప్రజా రంజక పరిపాలన అందిస్తున్న వైకాపా ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేయడం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తగునా అని జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య అన్నారు. మంగళ వారం తన కార్యాలయంలో ఆ పార్టీ వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావు, మండల కన్వినర్ పాంగి గుణ బాబు లతో కలిసి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గా 14 ఏళ్ల అనుభవమున్న ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 2024 లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పై అపనిందలు మోపడం సరి కాదన్నారు. తప్పొప్పులు తెలుసుకోలేని స్థితిలో ప్రజలు లేరన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని, వైకాపా ప్రభుత్వంలో ప్రజలంతా తమ వెంటే ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ప్రజలంతా తన వెంట ఉంటే ప్రతిపక్షానికి ఎందుకు పడిపోయారో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. అమాయక గిరిజనులను ఏమార్చలని మాట్లాడ డం మంచిది కాదన్నారు. మీ విజన్ 2020 కి ముందే ప్రజలు మీకు చెక్ పెట్టారని, అది కొనసాగింపే తప్ప మరో మారు తెదేపా అధికారంలోకి రావడం కల అని ఆయన జోస్యం చెప్పారు.