విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని బీసీ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షులు ఈరేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షులు ఈరేష్ బీసీ హాస్టల్ ను సందర్శించి, అక్కడున్న విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాగునీటి కొళాయిలకు ట్యాపులు లేకపోవడంతో తాగునీరు వృధాగా పారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గదులలో ఫ్యాన్లు లేకపోవడంతో దోమల బెడద ఎక్కువై, విద్యార్థులు విష జ్వరాలు గురయ్యే అవకాశం ఉందన్నారు. గదుల పైకప్పులు ప్రమాదకరంగా మారి పడిపోయినా పట్టించుకోవడం లేదని, విద్యార్థులకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు. హాస్టల్లో మెనూ కూడా పాటించడం లేదని ఆరోపించారు. వార్డెన్ విధులకు సరిగా హాజరు కావడం లేదన్నారు. కావున జిల్లా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్లో విద్యార్థులకు మౌళిక వసతులు కల్పించి, వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హాస్టల్ కమిటీ విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు బాస్కర్ రెడ్డి, రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.