సస్పెండ్కు గురైన సంజయ్ సింగ్ నిబంధనలకు విరుద్ధంగా జాతీయ చాంపియన్ షిప్లు నిర్వహించడంతో పాటు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఒలింపిక్ విజేత, ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ బుధవారం ప్రకటించారు. రెజ్లర్ల ఆందోళనలతో వెనక్కి తగ్గిన కేంద్రం .. కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షుడిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్రం నియమించిన అడ్హక్ కమిటీ ఫెడరేషన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది.అయితే సస్పెండ్కు గురైన సంజయ్ సింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ పోటీలు ఎలా నిర్వహిస్తారని, వారు జారీ చేసే నకిలీ సర్టిఫికెట్లు భవిష్యత్తులో క్రీడాకారులను ఇబ్బందులకు గురిచేస్తాయని హెచ్చరించారు. ఫెడరేషన్ నిధులను ఎలా దుర్వినియోగం చేస్తారని మండిపడ్డారు. ఈ విషయంలో క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ జోక్యం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో జైపూర్లో జాతీయ రెజ్లింగ్ చాంపియన్ షిప్ జరగనుంది. కానీ తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి సంజయ్ సింగ్ జాతీయ ఛాంపియన్షిప్లను నిర్వహిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లని జారీ చేస్తున్నారు సాక్షి మాలిక్ ఎక్స్లో ట్వీట్ చేశారు. వారి తప్పు లేకపోయినా కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి భవిష్యత్తు నాశనం కాకుండా సంజయ్ సింగ్పై చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.