ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శశి కుమార్
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): – గ్యారెంటీ పెన్షన్ పథకం ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 4న విశాఖ కేంద్రంలో సాగర సంగ్రామ దీక్షను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు దేపూరు శశి కుమార్ అన్నారు. ఆ సంఘం మండల అధ్యక్షుడు కాకరి చందర్రావు, జోనల్ కార్యదర్శి బౌడు గంగరాజు లతో కలిసి మండలంలో ఉన్న పాఠశాలలను సందర్శించి ఆ పాఠశాలలో ఉపాధ్యాయులతో పాత పెన్షన్ విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉద్యోగులతోనే ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు సంపూర్ణంగా అందుతున్నాయని వారు గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై కపట ప్రేమ చూపించడం సబబు కాదన్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగులు పదవి విరమణ తర్వాత పొందే పెన్షన్ లాభాలు కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు గుర్తు చేశారు. ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సాగర సంగ్రామ దీక్ష గోడపత్రికలను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహేష్, సత్యనారాయణ, పాత్రుడు, కామేష్, ప్రసాద్, రమేష్ నాయుడు, అచ్చిరాజు, దేవదాసు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.