ఆర్ వి నగర్ వైద్యాధికారిణి సౌమ్య
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని ఆర్ వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సౌమ్య అన్నారు. మండలంలోని అంతర్ల ఆరోగ్య ఉప కేంద్రం వద్ద శుక్రవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత ఎంపీటీసీ సభ్యురాలు దాసరి ధారలక్ష్మి, మండల కో ఆప్సన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సుమారు 126 మంది వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి సౌమ్య మాట్లాడుతూ సాధారణ సమస్యలతో పాటు, అధికంగా కంటి సంబంధిత, రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు వైద్య సేవలు పొందేందుకు వచ్చారన్నారు. మన్యప్రాంత మారుమూల గ్రామాల ప్రజలకు ఈ కార్యక్రమం వరమన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ పి హెచ్ సీ మరో వైద్యాధికారి రాజా రవీంద్రనాథ్ చౌదరి, ఆర్థోపెడిక్ వైద్యాధికారి సాయి కృష్ణ, అజయ్ బాబు, వీఆర్వో విష్ణు, సచివాలయ కార్యదర్శి శివ, వైద్య ఆరోగ్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ లు, వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.