విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ ఎస్పీసీఎస్ బాలుర హైస్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న గోర కాటి పెద్దారెడ్డి తన పాఠశాలకు ప్రధాన గేట్లకు ఇరువైపులా సిమెంట్ ప్లాట్ఫారం కొరకు విరాళంగా 2 లక్షల 90 వేల రూపాయలు ఇవ్వడంతో మానవతను చాటుకొని ఉపాధ్యాయులచే ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం బల్ల భాస్కర్ మాట్లాడుతూ పెద్దారెడ్డి దాతృత్వంలోనూ, చదువులోనూ తనకు తానే సాటి అని తెలిపారు. పేద విద్యార్థుల అన్న ప్రేమను చూపిస్తారని, వారి చదువుకు కావలసిన ఏదైనా సరే తన వంతుగా సహాయం చేస్తారని తెలిపారు. అంతేకాకుండా గత పది సంవత్సరాలుగా తన ఆంగ్లం సబ్జెక్టు నందు 100కు 100 శాతము ఫలితాలను సాధిస్తూ,” వార్” అనే ప్రోగ్రామ్ను ప్రారంభించి, విద్యార్థులకు రాయడం, చదవడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. అంతేకాకుండా ఇటువంటి ఉపాధ్యాయునికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం కూడా సంతోషించదగ్గ విషయమని తెలిపారు. తదుపరి విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధ నేతల సిబ్బంది, పెద్దారెడ్డిని ఘనంగా శాలువాతో సత్కరించారు.