. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
. డీఎస్సీ నోటిఫికేషన్పై నేడు మళ్లీ విచారణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సుప్రీంకోర్టు నిబంధనలు పట్టించుకోరా అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్పై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బీఈడీ అభ్యర్థులకు అనుమతివ్వడం వల్ల దాదాపు 10 లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖాళీల భర్తీ చేపట్టిందని కోర్టుకి వివరించారు.
పిటిషన్ను సోమవారం విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై సుప్రీంకోర్టు నిబంధనలు దేశవ్యాప్తంగా అమలు కావాలి కదా? అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. నియామక ప్రక్రియలో సుప్రీం నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.