వృద్ధురాలి ఆవేదన
విశాలాంధ్ర – బుట్టాయిగూడెం : నాకు న్యాయం చేయండి.. ప్రాణ రక్షణ కల్పించండి… అంటూ మండలంలోని సీతారామ నగరానికి చెందిన గంధం సుబ్బాయమ్మ వేడుకోవడం పలువురిని కంటతడి పెట్టించింది. శనివారం సుబ్బాయమ్మ మండల కేంద్రమైన బుట్టాయిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ తన తల్లిదండ్రుల నుంచి తనకు వచ్చిన భూమిని కాజేయాలని తన పెద్దనాన్న కుమారుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని కన్నీళ్ల పర్యంతం అయ్యింది. మండలంలోని సీతారామ నగరంలో ఆర్. ఎస్ నెం.58/6 లో తమ తల్లిదండ్రులకు ఉన్న ఎకరం 3.68 సెంట్లు భూమి నుండి తనకు వాటాదనంగా 1975 సంవత్సరంలో సంక్రమించిన ఎకరం భూమికి మల్లబత్తుల వెంకన్న అనే వ్యక్తి తప్పుడు కాగితాలు సృష్టించి, తనను ఇబ్బందులకు గురి చేస్తూ ఆ భూమిని స్వాధీనపరచుకోవడానికి కుట్రలు పన్నుతున్నాడని మీడియా ముందు ఆమె తన బాధను వ్యక్తపరిచింది. ఆ భూమికి సంబంధించి అన్ని అర్హతలతో కూడిన పత్రాలు తమ వద్ద ఉన్న, ఎటువంటి సంబంధం లేని మల్లాబత్తుల వెంకన్న అనే వ్యక్తికి ప్రొటెక్షన్ కాగితాలు మంజూరు చేయడం తనను వేదనకు గురి చేస్తుందని వాపోయింది. గత 40 ఏళ్లుగా స్థానిక హక్కు భూ పత్రాలు తన పేరున ఉండడంతో రెవెన్యూ అధికారులు విచారణ చేసి తనకు పాస్ బుక్, ఖాతా నెం.164, 1-బి పట్టాదారు అడంగల్, పహణి మంజూరు చేశారని ఆమె తెలిపింది. అడ్డదారుల్లో భూమికి ప్రొటెక్షన్ తీసుకొచ్చిన ఆ వ్యక్తి సహకరించకుండా తనకు తన భూమిని అప్పగించి న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేసింది.