–– స్సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు
నల్లి ధర్మారావు డిమాండ్
విశాలాంధ్ర – శ్రీకాకుళం టౌన్: రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో జర్నలిస్టుల సంక్షేమాన్ని చేర్చాలని చిన్న, మధ్య తరహా వార్తా పత్రికల సంఘం ( స్సామ్నా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారావు,సిహెచ్ రమణా రెడ్డి విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.అక్రిడిటేషన్ నిబంధనలు సడలించాలని , హెల్త్ కార్డుల పథకం పటిష్టంగా అమలు చేయాలని, ప్రమాద బీమా,సంక్షేమ నిధి, ఉత్తమ జర్నలిస్టుల అవార్డులు పునరుద్ధరణకు మేనిఫెస్టో లో హామీ ఇవ్వాలని మంగళ వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు.ప్రస్తుత ఇళ్ల స్థలాల జీవోను సవరించి, సీనియారిటీ ప్రాతిపదికన నామమాత్రపు ధరకు మంజూరు చేయాలని కోరారు. ప్రొఫెషనల్ కమిటీలు పునరుద్ధరణకు, నిధులు కేటాయించి ప్రెస్ అకాడమీని పనిచేయించాలని, వెటరన్ జర్నలిస్టులకు పింఛన్లు ఇవ్వాలని ఈమేరకు మేనిఫెస్టోల్లో పై అంశాలను చేర్చి పార్టీల నాయకత్వాలు జర్నలిస్టుల పట్ల గల గౌరవం నిరూపించుకోవాలి అన్నారు. రాష్ట్రంలో వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా, ఓట్లు ఉన్నాయనే వాస్తవాన్ని గమనించాలని కోరారు.కాంగ్రెస్ తో కలిసి పని చేస్తున్న శ్రామిక వర్గ కమ్యూనిస్టు పార్టీలు తమ మేనిఫెస్టోలతో పాటు ఇతర పార్టీలపై కూడా ఒత్తిడి తేవాలని సూచించారు.