. ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతో కీలక సమావేశం
. గెలుపే లక్ష్యంగా తాడేపల్లిలో వ్యూహరచన
. జగన్ ప్రచార షెడ్యూల్పై ప్రణాళిక
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జిలతో శనివారం వైసీపీ కీలక సమావేశాన్ని నిర్వహించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి 34 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 32 మంది సమన్వయకర్తలు హాజరయ్యారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, కొట్టు సత్యనారాయణ, స్పీకర్ తమ్మినేని సీతారామ్ విచ్చేశారు. వీరందరితో ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా కసరత్తు చేశారు. ప్రతిపక్షాల పొత్తులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ సూచించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో నాయకులను కలుపుకుని ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కలిసి ముందుకు పోవాలని సూచించారు. ఉత్తరాంధ్రలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా నేతలకు దిశానిర్దేశం చేశారు. చేయలేని పనులను వేగవంతంగా చేయాలని, స్థానిక సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. వైసీపీ 175కి 175 గెలుపులో వ్యూహంగా ఇప్పటికే 11 జాబితాల ద్వారా పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను మార్పులు, చేర్పులు చేశారు. విజయనగరం మినహా శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఇన్ఛార్జిల మార్పులు, చేర్పులు చేపట్టారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇన్ఛార్జిలతో ఒక్కొక్కరిగా వైవీ, సజ్జల మాట్లాడి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితిని ఆరా తీశారు. సీఎం జగన్ నిర్వహించబోయే ఎన్నికల ప్రచార సభలు, షెడ్యూలుపైనా నేతలతో చర్చించారు.
మరో ముగ్గురు సమన్వయకర్తల నియామకం
వైసీపీ అధిష్ఠానం తాజాగా రెండు ఎంపీ, ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. అమలాపురం(ఎస్సీ) పార్లమెంట్ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాదరావు, కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బీవై రామయ్య, రాజోలు (ఎస్సీ) అసెంబ్లీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావుకు బాధ్యతలు అప్పగించింది. రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాపాకకు తిరిగి అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమిస్తుందని ఆశించినప్పటికీ, ఆయనను అమలాపురం పార్లమెంట్కు పంపింది. గత ఎన్నికల్లో జనసేన నుంచి రాపాక ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. దీంతో అమలాపురం సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధాకు చుక్కెదురైంది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు బాధ్యతలను కేటాయించారు. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బీసీ సామాజికవర్గానికి చెందిన బీవై రామయ్యను బరిలోకి దించారు. అంతకముందు మంత్రి గుమ్మనూరి జయరామ్ను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించగా, ఆయన అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో ఆయా సమీకరణల ఆధారంగా ఏకాభిప్రాయం రావడంతో వైసీపీ అభ్యర్థులను నియమించింది.
నేడు సిద్ధం చివరి సభ
రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు వైసీపీ తలపెట్టిన నాలుగోదైన చివరి సిద్ధం సభను బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం జరగనుంది.
తొలి సిద్ధం సభను ఉత్తరాంధ్రలోని భీమిలిలో నిర్వహించారు. రెండోది ఏలూరు జిల్లా దెందులూరు, మూడోది అనంతపురం జిల్లా రాప్తాడులో ఏర్పాటు చేశారు. అన్ని సభల కంటే పెద్దఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అంతకంటే దీటుగా 200 ఎకరాల్లో దాదాపు 15 లక్షల మందితో చివరి సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేపట్టారు. సీఎం ప్రసంగం అందరికీ కనిపించేలా స్క్రీన్లు అందుబాటులో ఉంచారు. 28 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టారు.