. వాయనాడ్ నుంచి పోటీ ఆయన స్థాయికి తగదు
. దీనిపై కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి
. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
న్యూదిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్నది నిర్ణయించే అధికారం ఆ పార్టీకి ఉంది కానీ ఆయన స్థాయి నాయకుడు నేరుగా బీజేపీని ఢీకొనడమే సముచితమని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకుడు కాదు… జాతీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు. అలాంటిది ఆయన బీజేపీతో ప్రత్యక్ష పోటీలో దిగాలి.
ఇందుకోసం వాయనాడ్ కాకుండా వేరొక స్థానం నుంచి పోటీ చేయలి’ అని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టడాన్ని అంతా స్వాగతించామని చెప్పారు. సామాజిక విభజనలు, ప్రజల్లో ఐక్యత లేకపోవడానికి, విద్వేషాలకు బీజేపీఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే కారణమని ఆయన నొక్కిచెబుతారని గుర్తుచేశారు. ప్రస్తుతం న్యాయ యాత్రను సాగిస్తున్నారని చెబుతూ ప్రజలకు న్యాయాన్ని నిరాకరిస్తున్నది ఎవరు? బీజేపీ
ఆర్ఎస్ఎస్ ఉమ్మడి సిద్ధాంతమే కదా! అని రాజా వ్యాఖ్యానించారు. అదే నిజమైతే వాయనాడ్ నుంచి పోటీ చేయడం ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారని రాహుల్ను ప్రశ్నించారు. తమకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనా లేక లెఫ్ట్నా తేల్చుకోవాలని హితవు పలికారు. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఆత్మవిమర్శ చేసుకోవడం అవశ్యమని డి.రాజా సూచించారు. బీహార్ పరిణామాలు అమిత్షా (హోంమంత్రి), మోదీ (ప్రధాని)నే కాదు ప్రతి ఒక్కరికి భయపెడుతున్నాయని చెప్పారు. ‘ఓ ర్యాలీలో పాల్గొనేందుకు ఈమధ్య బీహార్కు వెళ్లా. ప్రదర్శనలో లక్షల మంది పాల్గొని తమ సందేశమిచ్చారు. బీజేపీ (ఎన్డీయే)… నితీశ్ కుమార్ను తమ వైపునకు తిప్పుకుంది. బీహార్ను, భారత్ను కాపాడుకోవాలన్న కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారు. ఇందుకోసం పోరుకు సిద్ధమయ్యారు’ అని రాజా అన్నారు. ప్రజలను విభజించేందుకు మోదీ, అమిత్షా యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుల గణన ఎందుకు నిర్వహించరని నిలదీశారు. ప్రజల జీవనోపాధి సమస్యలు అమిత్షా, మోదీకి పట్టవన్నారు. ‘ఇండియా’ కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ మధ్య విభేదాలపై ప్రశ్నకు సీట్ల సర్దుబాటు సమస్య ఉన్నట్లు ఉందికానీ పెద్దగా విభేదాలేమీ లేవు అని రాజా బదులిచ్చారు.
సీట్ల సర్దుబాటు చాలా రాష్ట్రాల్లో జరగాల్సి ఉన్నదన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఏకాభిబ్రీపాయం కుదరలేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో కొంత మేరకు అవగాహన కుదిరింది కానీ అది ఏ విధంగా పరిణమిస్తుందో వేచిచూడాలని అన్నారు. ప్రతి పార్టీ తన స్వప్రయోజానికి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి దీనిపై చర్చించి పరిష్కరించుకోవాల్సి ఉంటుందని రాజా తెలిపారు. రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వాయనాడ్ నుంచే మళ్లీ పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది. అదే స్థానం నుంచి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా డి.రాజా భార్య, సీపీఐ నాయకులు అనీరాజా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్`మేలో జరగనున్నాయి.