. ఇందుకు వచ్చే ఎన్నికలే చివరి అవకాశం
. వయనాడ్లో అనీరాజా విస్తృత ప్రచారం
వయనాడ్: దేశంలో తారస్థాయికి చేరుకున్న ఫాసిజాన్ని అంతం చేయడమే లక్ష్యమని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యవర్గ సభ్యులు అనీరాజా ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అస్త్రం ద్వారా ఫాసిజాన్ని అంతం చేయాలని, అందుకు ఇదే చివరి అవకాశమని నొక్కిచెప్పారు. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా అనీరాజా రాబోయే లోక్సభ ఎన్నికల్లో సీపీఐ తరపున పోటీ చేస్తున్నారు. గెలిచేందుకే పోటీలో దిగుతున్నానని ప్రకటించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే మానవులకు, జంతువులకు మధ్య ఘర్షణను అంతం చేసేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరించేందుకు సీబీఐ, ఈడీ, ఐటీని ఫాసిస్టు శక్తులు దుర్వినియోగపరుస్తున్నాయని దుయ్యబట్టారు. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని, ప్రతి పార్టీ తమ అభ్యర్థిని పార్లమెంటు పదవి కోసం పోటీలో నిలబట్టవచ్చనీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ అభ్యర్థిత్వాన్ని ఉద్దేశించి అనీరాజా వ్యాఖ్యానించారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే కేరళ రాజకీయాలు భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్కు మధ్య రాజకీయ పోరు కొనసాగుతుందని తెలిపారు. గెలుపే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బరిలో దిగుతున్నట్లు అనీరాజా ఉద్ఘాటించారు. తనతో కలిసి రావాలని వయనాడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, స్థానికంగా జంతువులతో మానవుల ఘర్షణ ప్రధాన సమస్యగా ఉంది. బందీపుర టైర్ రిజర్వు గుండా వెళ్లే కోజికోడ్`కొల్లగల్ జాతీయ రహదారిపై రాత్రి ప్రయాణాలపై నిషేధం, రైల్వే కనెక్టివిటీ, గిరిజనులు, రైతుల జీవనోపాధి సమస్యలు వంటివి అపరిష్కృతంగా ఉన్నాయి. వయనాడ్లో గిరిజనులు, అణగారిన వర్గాలు, మైనారిటీల జనాభా ఎక్కువ కాగా ఇక్కడి ఏడు అసెంబ్లీ స్థానాల్లో రెండు ఎస్టీ, ఒకటి ఎస్సీ రిజర్వు స్థానాలు. నాలుగు చోట్ల యూడీఎఫ్, మూడు స్థానాల్లో ఎల్డీఎఫ్ ప్రాతినిధ్యం ఉంది.