. ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏ దశలో ఉంది
. పరిశ్రమ భూములేమైనా విక్రయించారా?
. పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేసే యోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని అడ్వకేట్ జనరల్ను ధర్మాసనం ప్రశ్నించింది. అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏ దశలో ఉంది? పరిశ్రమకు చెందిన భూములను ఇప్పటివరకు ఏమైనా విక్రయించారా? విక్రయిస్తే ఎన్ని ఎకరాలు అమ్మారో పూర్తి వివరాలు సమర్పించాలని ఉక్కు పరిశ్రమ సీఎండీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. భూముల విక్రయ దస్త్రాలు కోర్టు ముందుంచాలని పిటిషనర్కు సూచిస్తూ… తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది.
ప్రత్తిపాటి శరత్కు బెయిల్
విజయవాడ మాచవరం పోలీసులు బనాయించిన కేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్కు విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని న్యాయాధికారి బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్లారావు భార్య, కుమారుడు, బావమరిది సహా ఏడుగురిపై విజయవాడలోని మాచవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.