ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు సమర్పించలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)ను సుప్రీంకోర్టు నిలదీసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందజేసిన విరాళాలపై ఎస్బిఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ువివరాలు సమర్పించమని చెప్పండి అప్పుడు చూస్తాం. అన్నట్లుంది మీ వైఖరి. ఎస్బిఐ సెలక్టివ్గా ఉండకూడదు. కోర్టుపట్ల నిజాయితీగా వ్యవహరించాలిు అని డి.వై. చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రతి సమాచారం వెల్లడి కావాలి. బాండ్ల విషయంలో ఎస్బిఐ సెలెక్టివ్గా ఉండకూడదు. దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలి. దేన్నీ అణచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలను ఇవ్వాలని మేం తీర్పు చెప్పాం. ఎవరు ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యునిక్ నెంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్బిఐ ఎన్నికల కమిషన్కు సమర్పించాలి అని ఆదేశించారు. ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకు అన్ని అంశాలను అందించడమే కాకుండా ఎలాంటి సమాచారాన్ని దాచలేదని అఫిడవిట్ను కూడా దాఖలు చేయాలని ఎస్బిఐని ఆదేశించారు. మార్చి 21 సాయంత్రం 5.00 గంటలలోపు ఈ అఫిడవిట్ను సమర్పించాలని ఎస్బిఐకి గడువు విధించింది.