ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లను సవాలు చేస్తూ .. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. లిక్కర్ పాలసీ కేసులో తనపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోకుండా ఇడిని ఆదేశించాలని కోరారు. ఈ అంశంపై జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ నేడు మరోసారి విచారణ చేపట్టనుంది. బుధవారం విచారణ సందర్భంగా .. ఇడి కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తుందని తమకు భయం ఉందని, ఆయనకు రక్షణ కల్పిస్తే హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నారని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లను ఇడి అదుపులోకి తీసుకుందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఇడి కేజ్రీవాల్కు 9సార్లు సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఇడి గత శనివారం జారీ చేసిన సమన్లలో ఆదేశించిన సంగతి తెలిసిందే.