ఈనెల 26వ తేదీన కొవ్వొత్తుల ర్యాలీని విజయవంతం చేయాలి….వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు
విశాలాంధ్ర – బెలగాం : బిజెపి దేశాన్ని బలహీనపరిచే సిఎఎ చట్టం అమలును అడ్డుకోవాలని కోరుతూ వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీల శక్తులు మార్చి 26వ తేదీన పార్వతీపురంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీలో ప్రజలంతా పాల్గొనాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పిలుపునిచ్చాయి. స్థానిక సుందరయ్య భవనంలో గురువారం సిపిఎం పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అధ్యక్షతన వామపక్ష పార్టీలు, లౌకిక, ప్రజా తంత్ర శక్తులు, కాంగ్రెస్ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు, జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవరత్నం, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మోహన్ రావు, గోపాలం, సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఇందిరా, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె. రామస్వామి తదితరులు పాల్గొని మాట్లాడుతూ పౌరసత్వ చట్టం సవరణ పూర్తిగా విరుద్ధమైనదని, ఈ చట్టం దేశంలోని ముస్లింల సమస్య కాదని, పౌరులందరి సమస్యని, ఇది దేశ ఐక్యతకి లౌకిక, ప్రజాస్వామ్యానికి ముంచుకొస్తున్న ప్రమాదానికి సంబంధించిన సమస్య అని అన్నారు. అన్ని మతాలు, జాతులు కలసి పోరాడి స్వాతంత్రం సాధించుకున్నాయని, ఆర్ఎస్ఎస్ బిజెపి దేశ లౌకిక స్వభావాన్ని నాశనం చేసి నిరంకుశ హిందూ మత రాజ్యాంగంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఎన్.ఆర్.సి.సి.ఎ అమలు చేయటం అని తెలిపారు. ఇంత దుష్ట పన్నాగం పన్ని దేశాన్ని, రాజ్యాంగాన్ని బలహీనపరిచే సిఎఎ చట్టం అమలును అడ్డుకోవాల్సిన వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్రంలో బిజెపికి మోకరిల్లాయని, 2019లో పార్లమెంట్లో ఈ చట్టాన్ని బలపరిచాయని, మత ప్రాతిపదికన పౌరసత్వం అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్న మన దేశ పౌరులకు ప్రమాదం వస్తుందని నాయకులు తెలిపారు. అందుకు ఈ చట్టాన్ని అడ్డుకోవాలని సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ లిబరేషన్, కాంగ్రెస్ పార్టీలు, ప్రజాతంత్ర శక్తులు మార్చి 26న పార్వతీపురంలో కొవ్వొత్తులు నిరసన కార్యాచరణ చేపడుతున్నాయని, ఆరోజు సాయంత్రం 6 గంటలకు నుండి పార్వతీపురం పట్టణంలో చర్చి సెంటర్ నుండి మెయిన్ రోడ్డు మీద నిరసన ర్యాలీ చేపట్టాలని రౌండ్ టేబుల్ నిర్ణయించిందని, ఈర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పువ్వల ప్రసాదు, కె. గోపినాయుడు, కాంగ్రెస్ నాయకులు గోపాలం మోహన్, సిపిఎం నాయకులు బంకురు సూరిబాబు, సంచాన ఉమామహేశ్వరరావు, పి. రాజశేఖర్, అఖిల్, బలరాం. తదితరులు పాల్గొన్నారు.