రాముడి పేరుతో మోదీ ఓట్ల భిక్ష
‘నల్లారి’ని ఓడిరచండి: ఈశ్వరయ్య
విశాలాంధ్ర-రాజంపేట: ప్రధాని మోదీ ముత్తాతలు పుట్టకముందే రాముడిని భారతదేశ ప్రజలు దేవుడిగా ఆరాధిస్తున్నారని, అలాంటి రాముడిని వీధుల్లోకి తెచ్చి బీజేపీ ఓట్ల భిక్షం ఎత్తుకుంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఇండియా కూటమి బలపరిచిన రాజంపేట అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి బుక్కే విశ్వనాథ్ నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం మునిసిపాల్టీ వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్న బీజేపీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని, రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్లు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీ మిథున్రెడ్డి హయాంలో రాజంపేట అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదన్నారు. జిల్లా కేంద్రం గా మార్చడంలోను, మెడికల్ కాలేజీ మంజూరులోను, మూతపడిన పరిశ్రమలు తెరిపించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. కనీసం రాజంపేటలో రైలు నిలుపుదలచేసే శక్తి కూడా మిథున్ రెడ్డికి లేదని అన్నారు. ప్రజా సమస్యలపైన పార్లమెంటులో ఏ రోజైనా నోరు విప్పి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఐదేళ్ల కాలంలో రాజంపేటకు జగన్ చేసిందేమీ లేదన్నారు. మరలా గెలిపిస్తే గాలేరు నగరి పూర్తి చేస్తానని, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారకులు ఎవరో తేల్చలేదని, మంజూరైన మెడికల్ కళాశాల వేరే ప్రాంతానికి కేటాయించి మరలా ఇప్పుడు గెలిపిస్తే మెడికల్ కళాశాల ఇస్తానన్నడం ఓట్లు దండుకోవడానికేనని ధ్వజమెత్తారు. లౌకిక పార్టీ కాంగ్రెస్లో ఉంటూ ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మతతత్వ పార్టీ బీజేపీ తీర్థం పుచ్చుకొని రాజంపేట పార్లమెంట్కు పోటీ చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కేవలం సొంత ఆస్తులు పెంచు కోవడానికి ప్రభుత్వ,పేద ప్రజల భూములను ఆక్రమించుకున్నాడని ఈశ్వరయ్య ఆరోపించారు. ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ అభ్యర్థి విశ్వనాథ్ గుర్తు కంకి కొడవలి పై ఓటు వేసి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఇవ్వాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పీిఎల్ నరసింహులు, సహాయ కార్యదర్శి మహేశ్, సీపీఎం జిల్లా కమిటీ నాయకులు చిట్వేల్ రవి కుమార్, సిహెచ్.చంద్రశేఖర్, సీపీఐ రాజంపేట నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎం.ఎస్.రాయుడు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శివరామకృష్ణ దేవరా, కృష్ణప్ప, తుమ్మల రాధాకృష్ణ, సాంబశివ, జ్యోతి చిన్నయ్య, సికిందర్, గాలి చంద్ర పాల్గొన్నారు.