పిఠాపురంలో జనసేనానిని ఓడిస్తానని ముద్రగడ సవాల్
అన్న మాట ప్రకారం ఇప్పుడు తన పేరు మార్చుకుంటున్నట్లు వైసీపీ నేత ప్రకటన
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానన్నారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు చెప్పారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతానన్నారు.
కాగా, పవన్ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎన్నికల ముందు శపథం చేసిన విషయం తెలిసిందే. అన్న మాట ప్రకారమే ఇప్పుడు తన పేరు మార్చుకుంటున్నారు. అటు ఎన్నికల ఫలితాలపై ముద్రగడ స్పందించారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదని పేర్కొన్నారు. కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదన్నారు. సంక్షేమానికి ప్రజలు ఓటు వేయకపోతే.. రాబోయే రోజుల్లో ఏ సీఎం కూడా అటువైపు చూసే అవకాశం లేదన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిపొందిన నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.