. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమా?
. మోసాలపై దర్యాప్తునకు ఆదేశాలివ్వరెందుకు?
. ప్రధాని, కేంద్రాన్ని నిలదీసిన విపక్షాలు
. పరీక్షలో అక్రమాలపై సుప్రీం పర్యవేక్షణలో విచారణకు డిమాండ్
న్యూదిల్లీ: నీట్ పరీక్షలో అక్రమాలు దుమారం రేపాయి. వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షలో అక్రమాలపై విచారణ జరిపించకుండా, సమర్థించుకునేందుకు కేంద్రం యత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. నీట్ మోసాలపై ప్రధాని మౌనం వీడాలని, సుప్రీం పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. నీట్ పరీక్షను సమర్థించుకునేందుకు ప్రయత్నాలను మానుకోవాలని కాంగ్రెస్, డీఎంకే, ఆర్ఎల్డీ సహా విపక్ష పార్టీలు సూచించాయి. పరీక్షను పారదర్శకంగా నిర్వహించడంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విఫలమైందని విమర్శించాయి. ఈ పరీక్ష నిర్వహణలో లోపాలపై విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త ఆందోళనకు దిగిన విషయం విదితమే. ఇది నీట్ కాదు చీట్ (మోసం) అంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నీట్ అక్రమాలపై సుప్రీం పర్యవేక్షణలో విచారణకు డిమాండ్ చేసింది. పార్లమెంటు కొత్త స్థాయి సంఘాల ఏర్పాటు తర్వాత నీట్, ఎన్టీఏ, ఎన్సీఈఆర్టీపై లోతుగా సమీక్షను కోరింది. కేంద్రం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ కోచింగ్ కేంద్రాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నదని డీఎంకే విమర్శించింది. నీట్ వివాదంపై కేంద్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే తీవ్రంగా విమర్శించారు. గ్రేస్ మార్కులు ఇవ్వడం ఒక్కటే సమస్య కాదన్నారు. రిగ్గింగ్, పేపర్ లీకేజి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తో మోదీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్ర హం వ్యక్తంచేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కాకపోతే బీహార్లో అరెస్టులు ఎందుకు జరిగాయని ఖడ్గే ప్రశ్నించారు. గుజరాత్లోని గోద్రాలో నీట్ ముఠా గుట్టు రట్టు కాలేదా? దేశ ప్రజలను మభ్యపెట్టేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తోందా? అని నిలదీశారు. 24 లక్షల మంది యువతీ యువకుల ఆశలు, ఆకాంక్షలను మోదీ ప్రభుత్వం అణచివేసిందని ఖడ్గే మండిపడ్డారు. నీట్ మోసాలతో 24లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యంగా, దురహంకారంగా వ్యవహరించడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఖండిరచారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందిస్తూ నీట్ నిర్వహించిన తీరుతో ఎన్టీఏ సమగ్రత ప్రశ్నార్థకమైందన్నారు. 2014`19లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘ సభ్యునిగా నీట్కు మద్దతివ్వడాన్ని గుర్తుచేశారు. తమిళనాడు ఎంపీలతో పాటు మరికొందరు నీట్ వల్ల సీబీఎస్ఈ విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందన్నారని, దీనిపై సరైన విశ్లేషణ అవసరమన్నది తన అభిప్రాయమని చెప్పారు. ‘నీట్ వివక్షపూరితమా? పేద కుటుంబాల పిల్లలకు అవకాశాలు నిరాకరిస్తు న్నారా? మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు సైతం నీట్పై సందేహాలు వ్యక్తం చేశాయి. గత దశాబ్దంగా ఎన్సీఈఆర్టీ స్థాయి దిగజారింది. కొత్త స్థాయి సంఘాలు ఏర్పాటైన తర్వాత నీట్, ఎన్టీఏ, ఎన్సీఈఆర్టీపై లోతైన సమీక్ష నిర్వహించడానికి అత్యధిక ప్రాధాన్య ఇవ్వాలి’ అని జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా విద్యకు దూరమైన అణగా రిన వర్గాలకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉండగా, నీట్ వల్ల అందుకు ఆటంకం కలుగుతోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఎన్టీఏను కేంద్ర విద్యా మంత్రి సమర్థన… వాస్తవ పరిస్థితులకు పూర్తి వ్యతిరేకమన్నారు. ‘డబ్బుకు ఆశ పడిన కొందరు ఇన్విజిలేటర్లు ఓంఎఆర్ షీట్ల ట్యాంపరింగ్కు పాల్పడినట్లు గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోట్లాది రూపాయలు విలువ చేసే చెక్కులు, ఎనిమిది బ్లాంకు చెక్కులు లభ్యమైనట్లు తెలిపారు. ఈ కుట్ర వెనుక స్కూలు ప్రిన్సిపల్, ఫిజిక్స్ టీచర్తో పాటు అనేక నీట్ కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీనిని బట్టి వ్యావస్థాగత మార్పులు తక్షణావశ్యమనే చెప్పాలి’ అని స్టాలిన్ అన్నారు. నీట్ కారణంగా అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడాన్ని గుర్తుచేశారు. విద్యార్థులకు, సామాజిక న్యాయానికి, పేదలకు వ్యతిరేకమైన నీట్ వ్యవస్థను సమర్థించుకోవడాన్ని కేంద్రప్రభుత్వం ఆపేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ఎల్డీ) నేత తేజస్వీ యాదవ్ స్పందిస్తూ బీజేపీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అది కేంద్రమైనా… రాష్ట్రమైనా పేపర్ లీక్ అనివార్యమని వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ విద్యా మంత్రి బ్రత్యాబసు స్పందిస్తూ నీట్లో అక్రమాలపై దర్యాప్తు విషయంలో ప్రధాని మౌనం వహించడాన్ని విమర్శించారు. వైద్యులు కావాలనుకునే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్పై ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. కాగా, వైద్య కళాశాలల్లో సీట్ల కోసం కౌన్సెలింగ్ జులై 6న… సుప్రీం విచారణ జులై 8న మొదలవుతాయి.