వాటిని గుర్తించడం… సరిదిద్దడం అవసరం
బాధితులకు సత్వరమే గరిష్ఠ పరిహారమివ్వాలి
మృతుల కుటుంబాలకు రాహుల్ గాంధీ పరామర్శ
హాత్రస్/అలీగఢ్: హాత్రస్ ఘటన వెనుక పరిపాలన లోపాలు ఉన్నాయని, వాటిని గుర్తించడం, సరిదిద్దుకోవడం అవసరమని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. బాధితులకు గరిష్ఠ పరిహారం ఇవ్వాలని, ఇందులో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్ శుక్రవారం హాత్రస్లో పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అండగా నిలుస్తామంటూ భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వందకుపైగా కుటుంబాలు శోకంలో ఉన్నాయని, ఇది వారికి కష్ట సమయమని అన్నారు. రాజకీయ కోణంలో మాట్లాడను కానీ పరిపాలనపరంగా లోపాలు ఉన్నాయని మాత్రం చెబుతానన్నారు. తప్పులను గుర్తించడం అవసరమని సూచించారు. బాధితులంతా పేదలేనని, దు:ఖాన్ని దిగమింగి, తమ జీవితాలను చక్కదిద్దుకోవడం కోసం వీరికి పరిహారం అవసరమని, అది నామమాత్రంగా కాకుండా గరిష్ఠస్థాయిలో చెల్లించడం సముచితమన్నారు. పరిహారం ఇవ్వడంలో ఆరు నెలలు లేక సంవత్సరం జాప్యం చేస్తే ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్నుద్దేశించి అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారాన్ని యోగి ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలను కలిసి వారి బాధలు, కష్టాలను అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేసినట్లు రాహుల్ తెలిపారు. కార్యక్రమం జరిగినప్పుడు సరైన రీతిలో పోలీసు బందోబస్తు లేదని బాధిత కుటుంబాలు చెప్పాయన్నారు. రాహుల్ అంతకుముందు అలీగఢ్లో ఆగి… ఈ ఘటనకు సంబధించిన అక్కడి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అలీగఢ్కు చెందిన 17 మంది, హాత్రస్కు చెందిన 19 మంది తొక్కిసలాటలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, రాహుల్ శుక్రవారం ఉదయమే రోడ్డు మార్గంలో దిల్లీ నుంచి బయల్దేరగా ఆయన వెంట కాంగ్రెస్ యూపీ అధ్యక్షుడు అజయ్ రాయ్, రాష్ట్ర ఇన్చార్జి అవినాశ్ పాండే, అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటే, ఆఫీసు బేరర్లు ఉన్నారు. 7.15గంటలకు పిలాఖ్నా గ్రామానికి… 9 గంటలకు హాత్రస్లోని వైభవ్ నగర్ కాలనీలోగల గ్రీన్పార్కుకు రాహుల్ బృందం చేరుకుంది. రెండు చోట్ల 30 నిమిషాలు చొప్పున గడిపింది. 9.30 గంటలకు హాత్రస్ నుంచి వెళ్లిపోయింది. రాహుల్ పర్యటనను పురస్కరించుకొని హాత్రస్లో భద్రత పెంచారు. కీలకమైన మార్గాల్లో భద్రతా వలయాలు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు.
ధైర్యం చెప్పారు….
రాహుల్ తమకు ధైర్యం చెప్పారని, పరిహారం త్వరగా అందేలా చూస్తానన్నారని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. తమ సమస్యలను అడిగి తెలుసుకొన్నారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానంటూ భరోసా ఇచ్చారని చెప్పారు. హాత్రస్ ఘటనపై ఆరా తీశారని, పార్లమెంటులో దీని గురించి మాట్లాడతానని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారని వెల్లడిరచారు.
నేడు గుజరాత్కు రాహుల్…
రాహుల్ శనివారం గుజరాత్లో పర్యటిస్తారు. రాజ్కోట్ గేమ్ జోన్ అగ్ని ప్రమాదం, వడోదర పడవ ప్రమాదం, మోర్బి వంతెన కూలిన ఘటనలకు సంబంధించిన బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ఆయా కుటుంబాలను కలిసి ధైర్యం చెబుతారు. ఈ మేరకు కాంగ్రెస్ గుజరాత్ అధ్యక్షుడు శక్తిసిన్హా తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జీపీసీసీ కార్యాలయాన్ని సందర్శిస్తారని, పార్టీ కార్యకర్తలను కలుస్తారన్నారు. రాజ్కోట్లోని గేమింగ్ జోన్ మృతుల కుటుంబాలతో పాటు ఇటువంటి ఘటనల బాధితులను పరామర్శిస్తారని ఆయన చెప్పారు. గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (జీపీసీసీ) కార్యాలయం వద్ద బీజేపీకి, కాంగ్రెస్కు మధ్య ఘర్షణ జరిగిన వేళ రాహుల్ పర్యటనపై ప్రకటన రావడం చర్చకు దారితీసింది.