. నేడు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
. షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపిణీపై దృష్టి
. ప్రజాభవన్లో చర్చలకు ఏర్పాట్లు పూర్తి
. దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీకి అధికారులు హైదరాబాద్ ప్రజాభవన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజుల పాటు హస్తినలో ప్రధాని, కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించి బిజీబిజీగా గడిపిన ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం సాయంత్రం 6గంటలకు ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు.విభజనకు సంబంధించి పెండిరగ్లో ఉన్న అంశాల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగనుంది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు కొనసాగనుండగా… ఈలోపు రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తి కావాలి. కానీ పదేళ్లు పూర్తయినా సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారినప్పటికీ షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపైనే చర్చించే అవకాశమున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ గతంలో షీలాబేడీ కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అలాగే పదో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. అలాగే విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై కూడా ఈసమావేశంలో చర్చించే అవకాశముంది. దాదాపు రూ.24వేల కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుండగా… రూ.7వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వమే తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెబుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండిరగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి లో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో దిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా వీడిపోయింది. విభజన సమస్యలపై ఏపీ ప్రభుత్వ వాదనకు సంబంధించి నోట్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గత కమిటీలో ఉన్న కుటుంబరావు, ప్రేమ చంద్రారెడ్డి, బాలసుబ్రహ్మణ్యంతో అధికారులు మాట్లాడి నివేదిక సిద్ధం చేసినట్లు తెల్సింది. చీఫ్ సెక్రటరీతో పాటు, సీఎంఓ అధికారులను కూడా హైదరాబాద్ రావాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు. గతంలో జరిగిన చర్చల్లో ప్రతిష్ఠభన ఎక్కడ ఏర్పడిరది… ఇప్పుడు పరిష్కరించాల్సిన అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ బకాయిలపై కోర్టుల్లో వ్యాజ్యాలు, ఆస్తుల పంపిణీ పై కోర్టుల్లో ఉన్న పిటిషన్ల వివరాలను కూడా సేకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈసమావేశానికి రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు పవన్ కల్యాణ్, మల్లు భట్టివిక్రమార్క కూడా హాజరవుతున్నట్లు తెల్సింది.