. హత్యలు, దాడులపై పార్లమెంటులో గళమెత్తండి
. వైసీపీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఏపీలో జరుగుతున్న హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలపై పార్లమెంట్లో గళమెత్తాలని పార్టీ ఎంపీలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్సభ సభ్యులు హాజరయ్యారు. జగన్ మాట్లాడుతూ… ఈనెల 24వ తేదీ బుధవారం దిల్లీలో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా ఏం జరుగుతుందో యావత్ దేశం దృష్టికి తీసుకెళ్తామని, అందుకే దిల్లీ ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. దిల్లీలో ధర్నా తర్వాత పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై గట్టిగా మాట్లాడాలన్నారు. చంద్రబాబు ఆశించినట్లుగా వైసీపీని అణగదొక్కలేరని, దిల్లీలో జరిగే నిరసన ద్వారా ఆయనకు గట్టి హెచ్చరికలు పంపాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వినుకొండలో జరిగిన హత్యతో రాష్ట్రంలో హింస పరాకాష్ఠకు చేరిందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని పార్టీ ఎంపీలకు సూచించారు. ఈనెల 23వ తేదీ మంగళవారం నాటికి దిల్లీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకోవాలన్నారు అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తామని, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, సుభాష్ చంద్రబోస్, మిథున్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.
కూటమి ప్రభుత్వ అరాచకాలు ఆపాలి: అయోధ్యరామిరెడ్డి
పార్లీ పార్లమెంటరీ సమావేశం అనంతరం క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాతో ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ చేస్తున్న భౌతిక దాడులను వెంటనే ఆపాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.దీనిపై పార్లమెంటులో లేవనెత్తడం, కేంద్రం దృష్టికి తీసుకురావడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. అంతేకాక ఇక్కడ జరిగిన పరిణామాలను ఒక ఫోటో గ్యాలరీ, వీడియోల ద్వారా దేశ ప్రజలందరికీ తెలియజెప్పాలనే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇది ఒక రాజకీయ పార్టీపై జరుగుతున్న దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా ఆయన వ్యాఖ్యానించారు.