రాష్ట్ర ప్రజలు మరచిపోయిన పాత పథకాల పేర్లు అయిదారేళ్ల తర్వాత తెరమీదకు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన ఎనిమిది (కొత్తగా ప్రకాశం కలిపారు) జిల్లాల్లో బుందేల్ ఖండ్ తరహా పథకాలు అమలు జరుగుతాయని వెల్లడిరచారు. అంత క్రితమే బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేక ప్యాకేజీ అమలు జరుగుతుందని చెప్పి వున్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ పథకాల పూర్వాపరాల్లోకి వెళితే 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన చట్టం రాజ్యసభలో చర్చల సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెర మీదకు తెచ్చారు. అవశేష ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ నిర్దేశించే రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 46(3)ప్రస్తావనకు వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ వెనుకబడిన ఏడుజిల్లాలకు గతంలో ఒడిశాకు చెందిన కోరాపుట్ బోలంగీర్ కలహండి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో వ్యాపించిన బుందేల్ఖండ్ ప్రాంతాల్లో అమలు జరిగిన తరహాలో ప్రత్యేక ప్యాకేజీ వుంటుందని ప్రకటించారు. ఆ తర్వాతనే ఇవి ప్రాచుర్యంలోని కొచ్చాయి.
2014 ఎన్నికల అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొలువుదీరిన తరువాత వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.24,350 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కాని కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 50 కోట్లు చొప్పున కొంత కాలం రూ.1,750 కోట్లు ఇచ్చి మంగళంపాడిరది. ప్రత్యేక ప్యాకేజీ పథకాల గురించి ప్రస్తావించే సమయంలో బుందేల్ఖండ్కు గతంలో చేసిన వ్యయం పరిశీలిస్తే ఆంధ్ర ప్రజలను ఎంతగా మోసంచేశారో అవగతమౌతుంది. యూపీఏ ప్రభుత్వం హయాంలో 2009-10 నుండి అయిదేళ్లకాలంలో బుందేల్ఖండ్లో ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.7,266 కోట్ల రూపాయల వ్యయం చేశారు. బహుశా ఇది దృష్టిలో పెట్టుకొని మన్మోహన్సింగ్ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో అవశేష ఆంధ్రప్రదేశ్ రెండురకాల వెసులుబాట్లు లభించాయి. ఒకటి చట్టబద్దత గలవి. రెండు హామీలు. హామీలకింద ప్రత్యేక హోదా గట్రా వస్తాయి. కాని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ పోలవరం వెనుకబడిన జిల్లాల్లో మౌలిక సదుపాయాలు కల్పన సెక్షన్ 94 (3)చట్ట బద్దత గలవి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం తమకు రాజకీయ ప్రయోజనం లేనిదే పిల్లికి కూడా భిక్షంపెట్టదని తేలిపోయిన పూర్వ రంగంలో ప్రస్తుతం ఎన్నికలు తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇంతకాలం ఎగ్గొట్టిన చట్ట బద్దత గల పథకాల అమలుకు సిద్ధం కావడం శుభ పరిణామమే. ప్రత్యేక ప్యాకేజీ కింద జిల్లాకు ఇచ్చే నిధులు మౌలిక వసతుల కల్పనకు మైనర్ ఇరిగేషన్తోపాటు పాఠశాల భవనాలకు వ్యయం చేయవచ్చని చెబుతున్నారు. గతంలో లాగా జిల్లాకు యాభైకోట్లు రూపాయలతోనే సరిపెడితే సముద్రంలో కాకి రెట్టతో సమానమే. పేరుకు ప్రత్యేక ప్యాకేజీ గాని ఆచరణలో పెద్దగా ఒరిగేది వుండదు. ఈ పథకం కింద వెనుకబడిన రాయలసీమలో ఏదైనా సాగునీటి పథకం చేపడితే రెండు విధాలా లాభదాయకంగా వుంటుంది. ప్రత్యేక ప్యాకేజీ సార్థకతతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం తగ్గుతుంది. నరేంద్ర మోదీ సర్కారు 2022లో బుందేల్ఖండ్లో భారీ సాగునీటి ప్రాజెక్టు నదుల అనుసంధానం కింద నిర్మాణం చేపట్టింది. యమునా నది ఉపనదులైన కెన్ – బెత్వా నదుల అనుసంధానమిది. రూ.44,605 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకం నిర్మాణం జరుగుతోంది. మొదటి సంవత్సరమే కేంద్ర బడ్జెట్లో రూ.6700 కోట్లు కేటాయించారు. కేవలం 1.5 కోట్ల జనాభా కలిగి మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపించిన ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఈ పథకం నిర్మాణం జరుగుతోంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తాగునీటి వ్యయం భరించేందుకు నిరాకరించిన కేంద్రప్రభుత్వం కెన్బెత్వా అంశంలో మొత్తం ఖర్చు భరిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 24.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మొత్తం కొత్త ఆయకట్టే.
ఈ నేపథ్యంలో బుందేల్ ఖండ్ నమూనాతో వెనుకబడిన రాయలసీమలో రెండు, మూడు జిల్లాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కేంద్రం చేపట్టేట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిచేయవలసివుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొంతెమ్మ కోర్కెలు కోరడంలేదు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ స్వయంగా బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ అమలు జరుగుతున్నదని చెప్పి వున్నారు. రాష్ట్రాల విభజన సమయంలో గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు అమలు చేయడం సంప్రదాయం కూడా. పైగా దేశ రాజకీయ ముఖచిత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రెండు ఊతకర్రల్లో ఒకటిగా వున్నందున ముఖ్యమంత్రి కూడా గట్టిగా ఒత్తిడితెచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిగిల్చిపోయిన అప్పులు అరాచకం, శిరోభారంగా వున్న నేపథ్యంలో రాయలసీమలో పెండిరగ్లో వున్న పథకాలకు రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు వ్యయం చేయడం అంత సులభమైన అంశంకాదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బుందేల్ ఖండ్లో ప్రత్యేక ప్యాకేజీ కింద భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నందున అదే తరహాలోనే వెనుక బడిన రాయలసీమలో ప్రత్యేక ప్యాకేజీ కింద ఏదో ఒక ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భరించమని కోరడం సమంజసమే.
విశ్రాంత పాత్రికేయులు
సెల్: 9848394013